మహారాష్ట్ర రాజకీయాల్లో మలుపులు, ప్రభుత్వ ఏర్పాటు కోసం ఎన్సీపీకి గవర్నర్ ఆహ్వానం
మహారాష్ట్ర రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. ఆదివారం ప్రభుత్వం ఏర్పాటు చేయమని శివసేనను గవర్నర్ భగత్ సింగ్ ఆహ్వానించారు. బలనిరూపణ కోసం సోమవారం రాత్రి 7.30 గంటల వరకు సమయం ఇచ్చారు. కానీ బలనిరూపణలో శివసేన విఫలమైంది. తమకు మరింత గడువు ఇవ్వాలని గవర్నర్ను కోరగా సున్నితంగా గవర్నర్ తిరస్కరించారు.
మూడో పెద్ద పార్టీగా ఉన్న ఎన్సీపీని ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ ఆహ్వానించారు. దీంతో ఎన్సీపీ ప్రతినిధులు గవర్నర్ను కలిశారు. ఎన్సీపీకి మంగళవారం రాత్రి 8.30గంటల వరకు గవర్నర్ గడువు ఇచ్చారు. కాగా, శివసేన-ఎన్సీపీ కూటమికి బయటనుంచి మద్దతు ఇస్తానని తొలుత కాంగ్రెస్ పార్టీ చెప్పింది. తర్వాత మాట మార్చింది. దీంతో శివసేన ప్రభుత్వ ఏర్పాటు విషయంలో అడుగుదూరంలో నిలిచిపోయింది. దీంతో మూడో పెద్ద పార్టీగా ఉన్న ఎన్సీపీని గవర్నర్ ఆహ్వానించారు. ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమికి కలిసి 98 స్థానాలు ఉంటాయి. అంటే ప్రభుత్వ ఏర్పాటుకు 47 సీట్ల దూరంలో నిలిచిపోతుంది. అప్పుడు శివసేన మద్దతు తప్పనిసరి. కానీ శివసేనకు పోర్టు పోలియోలు తప్ప సీఎం పదవీ ఇచ్చే ఆస్కారం ఉండదు.
ఇది కాంగ్రెస్ పార్టీ వేసిన ఎత్తుగడ అనే అనుమానం కూడా కలుగుతుంది. శివసేనతో వెళితే ప్రాధాన్యం ఉండదని.. తమతో ఆ పార్టీ వస్తే చిన్నచూపు చూడొచ్చని భావించి ఉంటుంది. తనను కలువాలని గవర్నర్ భగత్సింగ్ నుంచి సమాచారం వచ్చిందని ఆ పార్టీ నేత అజిత్ పవార్ తెలిపారు. ఛగన్ భుజ్ బల్, జయంత్ పాటిల్ ఇతరులతో కలిసి వెళ్లామని చెప్పారు.