Maharashtra Government Formation:సోనియాకు ఉద్ధవ్ ఫోన్, ప్రభుత్వ ఏర్పాటుపై..
ముంబై: మహారాష్ట్రలో రాజకీయాలు చకచకా మారుతున్నాయి. అతిపెద్ద పార్టీగా అవతరించిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని గవర్నర్కు స్పష్టం చేసిన నేపథ్యంలో శివసేన రంగంలోకి దిగి పనులు చక్కబెట్టుకుంటోంది. శివసేన నుంచే ముఖ్యమంత్రి కావాలని పట్టుబట్టి ఇతర పార్టీలతో చర్చలు జరుపుతోంది.
మహారాష్ట్ర కొత్త సీఎంగా శివసేన అభ్యర్థి..శరద్ పవార్ రేసులో లేరు: సంజయ్ రౌత్
ఎన్సీపీ అధినే శరద్ పవార్, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కూడా మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేయడంతో శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే అంతా తానపై పరిస్థితిని చక్కబెడుతున్నారు.
ఓ వైపు ఎన్సీ అధినేత శరద్ పవార్ తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతుండగా.. మరో పక్క సోనియా గాంధీ కూడా తమ పార్టీ కీలక నేతలు, ఎమ్మెల్యేలతో మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే.. సోనియా గాంధీతో ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది.
మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుపై సోనియాతో ఉద్ధవ్ థాక్రే చర్చించినట్లు సమాచారం. ప్రభుత్వంలో ఎవరికి ఎన్ని పదవులు, ఇతర విషయాలపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర సీఎం పదవి మాత్రం తమకే కావాలని శివసేన ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో రెండు డిప్యూటీ సీఎం పదవులను ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు ఇవ్వాలని శివసేన నిర్ణయించినట్లు సమాచారం. అంతేగాక, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలలో ప్రతి పార్టీ 14 మంత్రి పదవులు పొందేలా చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. సోమవారమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే యోచనలో ఈ మూడు పార్టీలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, శివసేన తన ఛిరకాల స్పప్నమైన ముఖ్యమంత్రి పదవిని పొందేందుకు తహతహలాడుతోంది.