జమ్మూ కాశ్మీర్ లో జోరుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం: స్థలాన్ని కొనబోతున్న ప్రభుత్వం
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన అనంతరం.. అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపార కార్యకలాపాలు ఊపందుకోబోతున్నాయి. పొరుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు జమ్మూ కాశ్మీర్, లడక్ లల్లో భూములు, స్థలాలను కొనుగోలు చేయడంపై ఇన్నాళ్లూ నిషేధం కొనసాగింది. ఆర్టికల్ 370 రద్దుతో ఆ నిషేధం కూడా తొలగిపోవడంతో.. క్రమంగా భూతల స్వర్గం వైపు చూపులు సారించారు రియల్టర్లు. ప్రస్తుతం అక్కడ కొంత అనిశ్చితి వాతావరణం కొనసాగుతోంది. దీనికి తెరపడిన వెంటనే భూముల క్రయ విక్రయాలు ఊపందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. భారతీయ జనతాపార్టీ పాలిత రాష్ట్రం మహారాష్ట్ర.. ఈ దిశగా తొలి అడుగు వేసింది. శ్రీనగర్ సహా లడక్ లో పెద్ద ఎత్తున స్థలాన్ని కొనుగోలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
నెమలి కన్నుల గణేషుడు.. గిన్నిస్ బుక్ లో చోటు దక్కే ఛాన్స్?
మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున లడక్ లో పర్యాటక రిసార్ట్ ను నిర్మించడానికి స్థలాన్ని కొనుగోలు చేయనున్నట్లు చెబుతున్నారు. ఆర్టికల్ 370 రద్దు తరువాత జమ్మూ కాశ్మీర్ లో పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటం, జనజీవనం స్తంభించిపోవడం తెలిసిందే. ఇప్పుడిప్పుడే అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. జమ్మూ కాశ్మీర్, లడక్ లో జనజీవనం సాధారణ స్థితికి చేరుకున్న వెంటనే భూమిని కొనుగోలు చేస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించడానికి మహారాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ తరఫున లడక్ లో ఓ రిసార్ట్ ను ప్రభుత్వం తరఫున నిర్మించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ విషయాన్ని కొద్దిరోజుల కిందటే మహారాష్ట్ర పర్యాటకాభివృద్ధి శాఖ మంత్రి జయ్ కుమార్ రావల్ వెల్లడించారు.
దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ మంగళశారం ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. తొలిదశలో సుమారు 25 కోట్ల రూపాయలను దీనికోసం ఖర్చు చేయొచ్చని సమాచారం. మహారాష్ట్ర నుంచే కాకుండా.. దేశం నలుమూలల నుంచి జమ్మూ కాశ్మీర్ ను సందర్శించడానికి తరలి వెళ్లే పర్యాటకుల కోసం ఈ రిసార్ట్ ను కేటాయిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇదిలావుండగా..బీజేపీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాలైన గుజరాత్, అస్సాం, ఉత్తర్ ప్రదేశ్, బిహార్ ప్రభుత్వాలు కూడా జమ్మూ కాశ్మీర్ లో పెద్ద ఎత్తున భూములను కొనుగోలు చేసే అవకాశాలు లేకపోలేదు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు జమ్మూ కాశ్మీర్ వైపు తమ రాష్ట్రానికి చెందిన పర్యాటకులను ఆకర్షితులను చేయడానికి ఇదో మంచి అవకాశమని భావిస్తున్నట్లు చెబుతున్నారు.