షీనా బోరా హత్య కేసులో కీలక మలుపు
ముంబై: కూతురు షీనా బోరాను హత్య చేసిన తల్లి ఇంద్రాణి ముఖర్జీయా కేసులో కీలక మలుపు! షీనా హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసును మహారాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నాడు సిబిఐకి బదలీ చేసింది.
మహా ప్రభుత్వం ఈ రోజు ప్రకటన చేసింది. ఈ కేసులో కేవలం హత్యే కాకుండా ఆర్థికపరమైన అంశాలు కూడా ఉన్నందున విచారణను సీబీఐకి అప్పగిస్తున్నట్టు మహారాష్ట్ర హోంమంత్రిత్వ శాఖలోని ముఖ్య అధికారి కేపీ భక్షి తెలిపారు.
ఇప్పటివరకు ఈ కేసును ముంబై పోలీసులు విచారించారు. ఈ కేసును విచారిస్తూ వచ్చిన ముంబై పోలీస్ కమిషనర్ రాకేష్ మారియాను ఇటీవల అనూహ్యంగా బదిలీ చేశారు. ఆ స్థానంలో అహ్మద్ జావేద్ నియమితులయ్యారు.
అయితే ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న పీటర్ ముఖర్జియా, జావెద్లు సన్నిహితులని ఆరోపణలు వచ్చాయని, అందుకే కేసును రాష్ట్ర పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ చేసినట్టు భక్షి వివరించారు.
ప్రస్తుతం ఈ కేసులో షీనా తల్లి ఇంద్రాణి ముఖర్జియా, ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్ రాయ్లు రిమాండ్లో ఉన్నారు.
2012 ఏప్రిల్ 24న షీనా బోరా హత్య జరిగింది. మూడేళ్ల తర్వాత ఇది వెలుగు చూసింది. తల్లి ఇంద్రాణియే ఆమెను చంపినట్లు తేలింది. పోలీసులు తల్లి ఇంద్రాణి, ఆమెకు సహకరించిన డ్రైవర్ శ్యాం, ఆమె మొదటి భర్త సంజీవ్ను అదుపులోకి తీసుకొని అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.