సీబీఐపై నిషేధం: రాత్రికి రాత్రి ఉత్తర్వులు: మోడీ సర్కార్పై మాజీ మిత్రుడి వార్
ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐని నిషేధించింది. రాత్రికి రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ముందు- సీబీఐ అధికారులు మహారాష్ట్రలో ఏ కేసులోనైనా దర్యాప్తు చేపట్టాల్సి వస్తే.. ముందస్తుగా అక్కడి ప్రభుత్వ అనుమతిని తీసుకోవాల్సి ఉంటుంది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆ రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖకు అందజేయాల్సి ఉంటుంది. ఆ కేసు పూర్వాపరాలను పరిశీలించిన తరువాత.. హోం మంత్రిత్వ శాఖ అధికారులు అనుమతి ఇస్తేనే..సీబీఐ దర్యాప్తు చేయగలుగుతుంది.
ఈ మధ్యకాలంలో మహారాష్ట్రలో సీబీఐ అధికారులు చేపట్టిన కేసులు అధికంగా ఉంటున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ డెత్ కేసు, ఈ వ్యవహారంలో డ్రగ్స్ మాఫియా వెలుగులోకి రావడం, అదలా కొనసాగుతుండగానే టీఆర్పీ కుంభకోణం బయటపడటం వంటి వరుస సంఘటనలు చోటు చేసుకున్నాయి. అవన్నీ సీబీఐ పరిధిలోనివే. పైగా బాలీవుడ్ డ్రగ్స్ కేసులో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యురో అధికారులు సైతం జోక్యం చేసుకున్నారు. ఈ కేసు దర్యాప్తు వారి ఆధీనంలోకి వెళ్లింది.
అదే సమయంలో టీఆర్పీ స్కాం వ్యవహారం వెలుగులోకి రావడం, దాన్నీ సీబీఐకి అప్పగించడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. టీఆర్పీ కుంభకోణంలో ముంబై పోలీస్ కమిషనర్ పరమ్బీర్ సింగ్, రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ ఆర్ణబ్ గోస్వామి మధ్య వివాదాలు తలెత్తాయి. అదే సమయంలో ఈ కుంభకోణంలో ఉత్తర ప్రదేశ్ పోలీసులు కూడా జోక్యం చేసుకున్నారు. టీఆర్పీ స్కాంపై తొలి కేసు నమోదైంది కూడా ఉత్తర ప్రదేశ్లోనే. లక్నోలోని హజ్రత్ గంజ్ పోలీస్ స్టేషన్లో తొలి కేసు నమోదైంది.
దీన్ని అడ్డుగా పెట్టుకుని ఈ టీఆర్పీ కుంభకోణం కేసును సీబీఐకి అప్పగించారనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. సీబీఐని కేంద్ర ప్రభుత్వం క్రమంగా తమ రాష్ట్రంపై ఉద్దేశపూరకంగా ప్రయోగిస్తోందని భావించిన ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం.. సీబీఐని నిషేధించిందని అంటున్నారు. సీబీఐని నిషేధిస్తూ మహారాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ ఉప కార్యదర్శి కైలాష్ గైక్వాడ్ ఉత్తర్వులు జారీ చేశారు. తమ అనుమతి లేనిదే సీబీఐ దర్యాప్తు చేపట్టకూడదని సూచించారు.