మే 31 వరకూ అక్కడ లాక్డౌన్ పొడిగింపు: చేయి దాటిపోయినట్టే: రోజూ వందల్లో పాజిటివ్ కేసులు
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా ప్రస్తుతం అమల్లో ఉన్న 14 రోజుల మూడోదశ లాక్డౌన్ ఆదివారం నాటితో ముగియబోతోన్న వేళ..మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే అత్యధిక పాజిటివ్ కేసులను నమోదవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. మహారాష్ట్ర ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసింది. ఈ నెల 31వ తేదీ వరకు లాక్డౌన్ పొడిగించింది. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజోయ్ మెహతా ఉత్తర్వులను జారీ చేశారు. ఒకరి నుంచి మరొకరికి కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని అడ్డుకోవడానికి ఇదివరకు జారీ చేసిన ఉత్తర్వులకు కొనసాగింపుగా తాజా ఆదేశాలను జారీ చేశారు.
మూడుదశల లాక్డౌన్ సందర్భంగా రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు అమలులో ఉన్నాయో.. వాటినే ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగించబోతున్నట్లు తెలిపారు. నాలుగో దశ లాక్డౌన్లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసే నిబంధనలు, మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలు చేయడానికి పరిస్థితులు అనుకూలించాల్సి ఉందని అజోయ్ మెహతా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 90, 927 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 30 శాతం కేసులు ఒక్క మహారాష్ట్రలోనివే కావడం అక్కడి తీవ్రతను తెలియజేస్తోంది. మహారాష్ట్రలో ప్రస్తుతం 30,706 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
24 గంటల వ్యవధిలో 1576 కేసులు వెలుగులోకి వచ్చాయి. రెండోస్థానంలో గుజరాత్, మూడోస్థానంలో తమిళనాడు, నాలుగో స్థానంలో ఢిల్లీ కొనసాగుతున్నాయి. కరోనా వైరస్ మరణాల్లోనూ మహారాష్ట్రే అగ్రస్థానంలో కొనసాగుతోంది. మహారాష్ట్రలో 1135 మంది కరోనా బారిన పడి మరణించారు. ఈ నెలాఖరులోగా మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు 50 వేల మార్క్ను అందుకోవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముంబైలోనే 18,555 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా పేరున్న ధారవిలో వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.
Recommended Video
24 గంటల వ్యవధిలో 884 పాజిటివ్ కేసులు ముంబైలోనే రికార్డు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పరిస్థితుల్లో లాక్డౌన్ను మరింత కట్టుదిట్టంగా అమలు చేయాల్సి ఉంటుందని అజోయ్ మెహతా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలన్నింటినీ యథాతథంగా అమలు చేస్తామని అన్నారు. మరణాల సంఖ్యను తగ్గించడానికి, కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించడానికి యుద్ధ ప్రాతిపదికన అన్ని చర్యలను తీసుకుంటున్నామని చెప్పారు. అనేక కారణాల వల్ల కరోనా వైరస్ అదుపు తప్పిందని అభిప్రాయపడ్డారు.