శివసేనకే ప్రాధాన్యం: ఆ మూడు పార్టీలకు మంత్రి పదవుల పంపకాలు ఇలా
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి సిద్ధమైంది. 'మహా వికాస్ అఘాడీ'గా రూపుదిద్దుకున్న ఈ కూటమి ఇప్పటికే శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక మంత్రి పదవులపై ఈ పార్టీలు దృష్టి సారించాయి.
మహా ట్విస్టులు: మళ్లీ మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్! శరద్ పవార్తో భేటీ తర్వాత మారిన సీన్
మంత్రి పదవుల పంపకం ఇలా..
దాదాపు ఈమూడు పార్టీలు మంత్రి పదవుల పంపకాలను కూడా ఖరారు చేశాయి. ఒప్పందంలో భాగంగా సీఎం పదవితోపాటు శివసేన 15, డిప్యూటీ సీఎంతోపాటు ఎన్సీపీ 13, స్పీకర్ పదవితోపాటు కాంగ్రెస్ పార్టీకి 13 మంత్రి పదవులను పంచుకున్నట్లు తెలుస్తోంది.
డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్..
డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ నుంచి బహిష్కరించబడి తిరిగి వచ్చిన కీలక నేత అజిత్ పవార్నే ఎన్నుకునేందుకు అవకాశాలున్నాయి. దాదాపు ఆయన ఎన్నిక ఖరారైనట్లు పలువురు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అంతేగాక, ఎన్సీపీ శాసనసభా పక్ష నేతగా కూడా ఆయనే ఉంటారని అంటున్నారు.
అజిత్ పవార్ క్షమాపణలు చెప్పారా?
మొదట బీజేపీ ప్రభుత్వానికి మద్దతు పలికి ఆ తర్వాత డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసిన అజిత్ పవార్.. తిరిగి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ను కలిసిన విషయం తెలిసిందే. అజిత్ పవార్ను తిరిగి ఎన్సీపీలోకి ఆహ్వానించామని మరో కీలక నేత సుప్రియా సూలే తెలిపారు. కాగా, శరద్ పవార్కు అజిత్ పవార్ క్షమాపణలు చెప్పడంతోనే.. ఆయనను పార్టీలోకి స్వాగతించారని మరికొందరు నేతలంటున్నారు.
శివసేనకే ప్రాధాన్యం..
మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలుండగా బీజేపీకి 105, శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్ పార్టీ 44 గెలుచుకున్నాయి. ఈ మూడు పార్టీలో కూటమిలో శివసేనకు ఎక్కువగా ఎమ్మెల్యే సీట్లు ఉండటం, బీజేపీకి వ్యతిరేకంగా శివసేన వెళ్లడంతో ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు శివసేనకు మద్దతు పలికాయి. బీజేపీ ప్రభుత్వం ఏర్పడకుండా ఉండేందుకు శివసేనకు సీఎం పదవిని కూడా ఈ రెండు పార్టీలు వదిలేశాయి. అంతేగాక, మంత్రి పదవులను కూడా ఎక్కువగానే ఇచ్చేందుకు అంగీకరించాయి.
ఉద్ధవ్ తోపాటు డిప్యూటీ పలువురు మంత్రులు..
నవంబర్ 28న సాయంత్రం శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ముంబైలోని శివాజీ పార్కులో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. అదే సమయంలో డిప్యూటీ సీఎంతోపాటు పలువురు మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని కూటమి నేతలు అంటున్నారు. కూటమికి 166 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఇప్పటికే ప్రకటించారు. కాగా, థాక్రే కుటుంబం నుంచి తొలిసారి ముఖ్యమంత్రి పదవిని ఉద్ధవ్ థాక్రే చేపడుతుండటం గమనార్హం.