రెండు అసెంబ్లీ ఎన్నికల నగారా: బిజెపికి యువీ ప్రచారం
హైదరాబాద్: మహారాష్ట్ర, హర్యానా శాసనసభ ఎన్నికల నగారా మోగింది. కాగా, క్రికెటర్ యువరాజ్ సింగ్ బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షాను శుక్రవారంనాడు కలుసుకున్నారు. హర్యానా శాసనసభ ఎన్నికల్లో యువరాజ్ సింగ్ ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు అమిత్ షాకు యువరాజ్ సమాచారం ఇచ్చారు.
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మహారాష్ట్రలో 288 శాసనసభా స్థానాలకు, హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల కమిషనర్ (సిఈసి) వీఎస్ సంపత్ వెల్లడించారు.
శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన ఎన్నికల షెడ్యూల్ను వివరించారు. ఈ నెల 20న రెండు రాష్ట్రాల్లోనూ నోటిఫికేషన్ వెలువడుతుందని, నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈ నెల 27 చివరి తేదీ అని చెప్పారు. అక్టోబర్ 15న రెండు రాష్ట్రాల్లోనూ పోలింగ్ జరుగుతుందని, 19న ఓట్ల లెక్కింపు ఉంటుందని సంపత్ వివరించారు.
'నోటా' సౌకర్యం తప్పకుండా ఉంటుందని చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిపేందుకు గట్టి భద్రత ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. కాగా, ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న విషయం తెల్సిందే. జమ్మూ కాశ్మీర్ ఎన్నికలపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని సంపత్ చెప్పారు. వరదల కారణంగా అక్కడ ఎన్నికలు నిర్వహించలేని స్థితి ఉందని అన్నారు. జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ శాసనసభల కాలపరిమితి ముగియడానికి ఇంకా సమయం ఉందని ఆయన అన్నారు.