అంతా పీతలే చేశాయి.. రత్నగిరి డ్యాం గండిపై మినిస్టర్ వింత భాష్యం..
రత్నగిరి : మహారాష్ట్రలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లాయి. రత్నగిరి జిల్లాలో తివరే ఆనకట్టకు గండి పడటంతో దిగువన ఉన్న గ్రామాల్లో ఇళ్లు కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 19మంది చనిపోగా.. పలువురు గల్లంతయ్యారు. పెను విషాధాన్ని మిగిల్చిన ఈ ఘటనకు సంబంధించి మహారాష్ట్ర వాటర్ కన్జర్వేషన్ మినిస్టర్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరిచాయి.
శెభాష్ ప్రకాశ్ : సెల్యూట్ చేసిన సోషల్ మీడియా.. ఎందుకో తెలుసా ..!!
పీతల వల్లే గండి
తివరే ఆనకట్టకు గండి పడటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యాం నిర్మాణంలో లోపాలున్నాయని, అందుకే పగుళ్లు ఏర్పడ్డాయని స్థానికులు మండిపడుతున్నారు. ఈ విషయాన్ని ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆరోపించారు. అయితే స్థానికుల ఆరోపణలపై స్పందించిన మంత్రి తనాజీ సావత్ గతంలో నీరు లీకైన దాఖలాలు లేవని, భారీ సంఖ్యలో పీతలు డ్యాం చుట్టు చేరడం వల్ల వాటర్ లీకేజీ ప్రారంభమైందని అన్నారు. ఈ విషయాన్ని ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చాయని, అందుకనుగుణంగా చర్యలు తీసుకున్నామని, అయినా దుర్ఘటన జరగడం విచారకరమని అన్నారు. ఆనకట్ట నిర్మాణంలో లోపాలున్నాయన్న ఆరోపణలపై స్పందించిన తనాజీ.. స్థానికులు, రైతులు ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆ విషయం తెలిసిందని చెప్పడం విశేషం.
కొనసాగుతున్న గాలింపు
రత్నగిరిలో తివరే డ్యాంకు గండిపడిన ఘటనలో పలువురు గల్లంతైన నేపథ్యంలో రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగారు. వారి ఆచూకీ కోసం అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. గజ ఈతగాళ్లను రంగంలోకి దింపి డ్యాం పరివాహక ప్రాంతాలను జల్లెడపడుతున్నారు. శుక్రవారం ఉదయం మరో మృతదేహం బయటపడింది. దీంతో కలిపి ఇప్పటి వరకు వెలికితీసిన మృతదేహాల సంఖ్య 19కి చేరింది. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.
మృతుల కుటుంబాలకు రూ.4లక్షల పరిహారం
తివరే ఆనకట్ట తెగిన ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాలింపు, సహాయక చర్యల గురించి నిరంతరం సమీక్షిస్తున్నారు. మృతుల కుటుంబాలకు రూ.4లక్షల పరిహారం ప్రకటించారు. ఇదిలా ఉంటే రత్నగిరి జిల్లా చిప్లుస్ తాలూకాలోని తివరే డ్యాం తెగిన ఘటనలో దాదాపు 25 మంది చనిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ డ్యాంకు 20లక్షల క్యూబిక్ మీటర్ల నీటి నిల్వ సామర్థ్యం ఉండగా.. అది దాటిపోవడంతో మంగళవారం రాత్రి గండిపడింది. దీంతో డ్యాం కింద ఉన్న ఏడు గ్రామాలు ముంపునకు గురయ్యాయి 12ఇళ్లు కొట్టుకుపోవడంతో పలువురు గల్లంతయ్యారు.