విహార యాత్రకు వెళ్లారా మంత్రి గారు.. వరద బాధిత ప్రాంతాల్లో సెల్ఫీలా..! (వీడియో)
ముంబై : సెల్ఫీ పిచ్చి ముదురుతోంది. కామన్ మ్యాన్ నుంచి ఉన్నతస్థాయి పెద్దలదాకా అదో వ్యసనంలా మారింది. ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీలు తీయడం అలవాటైపోయింది. ఆ క్రమంలో మహారాష్ట్ర మంత్రి అడ్డంగా బుక్కయ్యారు. వరద ప్రాంతాల పర్యటనకు వెళ్లిన సదరు మంత్రి నవ్వుతూ సెల్ఫీ వీడియోలు దిగడం నెట్టింట వైరల్గా మారింది. దాంతో విపక్ష సభ్యులతో పాటు నెటిజన్లకు కూడా మాంఛి అస్త్రం దొరికినట్లైంది. దాంతో భిన్నరకాలుగా కామెంట్లు పెడుతూ మంత్రిని ఇబ్బందుల్లోకి నెట్టేశారు.
మహారాష్ట్రలో వరదలు ముంచెత్తుతున్నాయి. వరద నీరు పోటెత్తడంతో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. ఆ క్రమంలో సంగ్లీ జిల్లాలో వరద ప్రభావంతో నీట మునిగిన ప్రాంతాలను పరిశీలించడానికి బయలుదేరారు మంత్రి గిరిరాజ్ మహాజన్. అక్కడ చాలా చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. ఇళ్లు కోల్పోయి వేలాది మంది నిరాశ్రయులయ్యారు. అలాంటి పరిస్థితుల్లో అక్కడి ప్రజలను ఓదార్చాల్సింది పోయి సదరు మంత్రి పడవపై తిరుగుతూ జాలీగా కనిపించారు. అంతేకాదు ఏదో విహార యాత్రకు వెళ్లినట్లుగా సెల్ఫీ వీడియోకు ఫోజులిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో సదరు మంత్రి తీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మహారాష్ట్ర మంత్రి గారి సెల్ఫీ సరదా విపక్ష నేతలకు పండుగ తీసుకొచ్చింది. వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తూ అంత జాలీగా ఎలా ఉంటారంటూ మాటల యుద్దానికి తెరలేపారు. ఆ క్రమంలో ఎన్సీపీ లీడర్ ధనుంజయ్ ముండే ఓ రేంజ్లో ఫైరయ్యారు. సదరు మంత్రి తీరుపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఫడ్నవీస్కు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు.
టీఆర్ఎస్ లీడరా, మజాకా.. మొక్కుబడిగా మొక్క నాటిండ్రు.. కేసీఆర్కే వక్ర భాష్యం..! (వీడియో)
ఇదివరకు కూడా 2016లో బీజేపీ నేత పంకజ్ ముండే కరవు ప్రాంతాల్లో పర్యటిస్తూ సెల్ఫీలకు ఫోజులిచ్చి అప్రతిష్ట పాలయ్యారు. అదలావుంటే ఇప్పుడేమో ఈ మంత్రి గారి నిర్వాకం నెటిజన్లకు మంట పుట్టిస్తోంది. ఆ వీడియోను చూస్తూ ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తున్నారు. దీని ప్రభావం రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా చూపిస్తుందని మండిపడుతున్నారు. మహారాష్ట్రలో వరద బీభత్సం కారణంగా సంగ్లీ జిల్లాలో పడవ మునిగి 14 మంది చనిపోయారు. అలాంటి సిట్యువేషన్లో బాధితులను పరామర్శించాల్సింది పోయి సరాదాగా పడవపై ప్రయాణిస్తూ సెల్ఫీలు దిగడమేంటని మంత్రి నిర్వాకంపై రుసరుసలాడుతున్నారు నెటిజన్లు.