కేరళ,పంజాబ్ బాటలో మహారాష్ట్ర..సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం..కాంగ్రెస్లో చిచ్చురేపిన సిబాల్ కామెంట్లు
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమల్లోకి వచ్చి నెలరోజులు పూర్తయినా వ్యతిరేక నిరసనలు మాత్రం ఆగడంలేదు. ప్రతిపక్ష పార్టీలన్నీ ఈ బిల్లును ముక్తకఠంతో వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఆయా పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానాలు చోటుచేసుకుంటున్నాయి. మొదట కేరళ అసెంబ్లీ, రెండ్రోజుల కిందటే పంజాబ్ అసెంబ్లీ సీఏఏను అమలు చేయబోమని అసెంబ్లీలో తీర్మానాలు చేయగా, ఇప్పుడు మహారాష్ట్ర కూడా అదే బాటను అనుసరించనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ చేసిన కామెంట్లు సంచలనం రేపుతున్నాయి.
అంతా సిద్ధం..
మహారాష్ట్రలో సీఏఏ అమలు చేయబోమని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఇదివరకే మౌఖికంగా చెప్పారని, ఆ మేరకు అసెంబ్లీలోనూ తీర్మానాన్ని ప్రవేశపెట్టే అంశంపై తీవ్రస్థాయిలో చర్చ నడుస్తున్నదని, కాంగ్రెస్ పక్షనేత బాలాసాహెబ్ థోరాట్ కూడా స్పష్టమైన అభిప్రాయం చెప్పారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రాజు వాఘ్మారే వెల్లడించారు. అధికార ‘మహా వికాస్ ఆగాధి‘ కూటమిలోని మూడు పార్టీలూ (శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్) దీనికి అనుకూలంగా ఉన్నాయని, తీర్మానం ప్రవేశపెట్టబోయే తేదీలు త్వరలోనే వెల్లడిస్తామని వాఘ్మారే తెలిపారు.
రాష్ట్రాలకు ఆ హక్కులేదు..
ఒకవైపు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల అసెంబ్లీల్లో సీఏఏ వ్యతిరేక తీర్మానాలు ఆమోదం పొందుతుండగా.. అదే పార్టీకి చెందిన సీనియర్ నేత, ప్రముఖ అడ్వొకేట్ కపిల్ సిబాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు గనుక పౌరసత్వ సవరణ చట్టం సమంజసమేనని తీర్పు చెబితేగనుక రాష్ట్రాలు ఇరకాటంలో పడటం ఖాయమని సిబాల్ అన్నారు. అలాంటి పరిస్థితిలో కేంద్రం రూపొందించిన చట్టాన్ని కాదనే హక్కు రాష్ట్రాలకు ఉండబోదని చెప్పారు.
పోరాటం కొనసాగాల్సిందే..
కొజికోజ్ లో జరుగుతోన్న కేరళ లిటరరీ ఫెస్టివల్ లో మాట్లాడుతూ కపిల్ సిబాల్ సీఏఏపై తన అభిప్రాయాల్ని వెల్లడించారు. ‘‘ఈ చట్టం ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్ధమైందే. అయితే ఈ విషయాన్ని సుప్రీంకోర్టు కూడా అంగీకరించాల్సిఉంటుంది. అలా కాకుండా కోర్టు గనుక సీఏఏను సమర్థిస్తే.. ఇప్పుడు వ్యతిరేక తీర్మానాలు చేసిన రాష్ట్రాలకు ఒకింత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. కోర్టు చెప్పిన తర్వాత కూడా సీఏఏను అమలు చేయకపోవడం రాజ్యాంగవిరుద్ధమవుతుంది. చట్టానికి వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగించాలి''అని సిబాల్ పేర్కొన్నారు. సీనియర్ నేత కామెంట్లతో కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడినట్లయింది.