ముంబైలో ఉగ్రకలకలం: ఉగ్రవాది స్కెచ్ విడుదల
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో అనుమానాస్పద వ్యక్తులు ఆయుధాలతో సంచరిస్తున్నారన్న నేపథ్యంలో నేవీ ముంబై అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. దీంతో పాటు అనుమానిత ఉగ్రవాది స్కెచ్ను విడుదల చేశారు.
ముంబైకి యాభై కిలోమీటర్ల దూరంలో యురాన్లోని నేవీ ఆయుధాగారం దగ్గర ఐదారుగురు వ్యక్తులను తాము చూసినట్లు అక్కడి పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు చెప్పారు. దీంతో నేవీ అత్యంత అప్రమత్తత ప్రకటించింది.
వారి కోసం ముంబై మొత్తం విస్తృత గాలింపు చర్యలు చేపడుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ను కూడా రంగంలోకి దింపారు. ఏటీఎస్, నేవీ, పోలీసు అధికారులతో కలిసి ఎన్ఎస్జీ అనుమానిత వ్యక్తుల కోసం గాలిస్తోంది.
పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నామని, ప్రజలు భయాందోళన చెందాల్సిన పని లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ట్వీట్ చేశారు. ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న వ్యక్తులు సంచరించిన యురాన్ ప్రాంతంలోనే పోర్టు, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఉండటంతో ఆ ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.