గౌరీ లంకేష్ హత్య, 11 రివాల్వర్లు, నాటు బాంబులు సీజ్, ఏడాదిలో రూ. 40 లక్షలు!
బెంగళూరు: ప్రముఖ కన్నడ పత్రిక ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య కేసులో కర్ణాటక ప్రత్యేక బృందం పోలీసులు (ఎస్ఐటీ) అధికారులు మహారాష్ట్రలోని పూణేలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసిన వారికి గౌరీ లంకేష్ హత్య కేసుతో సంబంధాలు ఉన్నాయని ఎస్ఐటీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడి నుంచి 11 రివాల్వర్లు, నాటు బాంబులు స్వాధీనం చేసుకున్నారు.
పూణే సిట్ అధికారులు
మహారాష్ట్ర ప్రత్యేక బృందం పోలీసులు (ఎస్ఐటీ) అధికారులు ఈనెల 10వ తేదీన ముగ్గురిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి తుపాకులు, నాటు బాంబులు స్వాధీనం చేసుకున్నారు. సుదాన్వ గూండాలేకర్ (39), శరద్ కలష్కర్ (25), వైభవ్ రావత్ (40) అనే ముగ్గురిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
11 రివాల్వర్లు, నాటు బాంబులు
సుదాన్వ గూండాలేకర్ ను అరెస్టు చేసిన సమయంలో అతని దగ్గర 11 రివాల్వర్లు, నాటు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అమోల్ కాళేకు, సుదాన్వ గూండాలేకర్ కు దగ్గరి సంబంధాలు ఉన్నాయని సిట్ అధికారులకు సమాచారం అందడంతో పూణె వెళ్లి వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
రివాల్వర్ ఎక్కడ ?
సుదాన్వ గూండాలేకర్ దగ్గర స్వాధీనం చేసుకున్న రివాల్వర్లలో ఒక రివాల్వర్ గౌరి లంకేష్ ను హత్య చెయ్యడానికి ఉపయోగించి ఉంటారని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గౌరీ లంకేష్ ను హత్య చెయ్యడానికి ఉపయోగించిన బైక్ ను సిట్ అధికారులు స్వాధీం చేసుకున్నారు.
టచ్ లో ఉన్నాడు
గౌరీ లంకేష్ ను 7.65 ఎంఎం రివాల్వర్ తో హత్య చేశారని సిట్ అధికారుల విచారణలో వెలుగు చూసింది. అయితే ఇప్పటి వరకూ రివాల్వర్ మాత్రం సిట్ అధికారులకు చిక్కలేదు. సుదాన్వ గూండాలేకర్ శివ ప్రతిష్టాన హిందుస్తాన్, హిందూ జాగరణ సమితితో నిత్యం టచ్ లో ఉన్నారని పోలీసులు అంటున్నారు.
రూ. 40 లక్షలు
సుదాన్వ గూండాలేకర్ స్నేహితుడితో కలిసి సీఎడీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ప్రకటనల కంపెనీ నిర్వహిస్తున్నాడని సిట్ అధికారులు చెప్పారు. గత ఏడాది సుదాన్వ గూండాలేకర్ కంపెనీ ఏకంగా రూ. 40 లక్షలు వ్యాపారలావాదేవీలు నిర్వహించిందని, ఆ కోణంలో విచారణ చేస్తున్నామని సిట్ అధికారులు తెలిపారు.