ఉద్ధవ్ పదవిపై కరోనా పంజా: సీఎంగా ఉండేనా..ఊడేనా, కేంద్రం కనికరిస్తేనే...!
ముంబై: మహారాష్ట్రలో కరోనావైరస్ కేసులు ఎక్కువైపోతున్నాయి. దేశంలోనే అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రంగా మహారాష్ట్ర ముందువరసలో ఉంది. ఇక ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కేసులు మాత్రం తగ్గట్లేదు సరికదా రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ సంక్షోభం ఇలా ఉంటే రాజకీయంగా కూడా అక్కడ సంక్షోభం ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది. సంక్షోభంలో "మహా" సంక్షోభం ఏమిటో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ముగుస్తున్న సమయం... ఉద్ధవ్ థాక్రే పరిస్థితి ఏంటి..?
మహారాష్ట్రలో ఇప్పుడు రెండు సంక్షోభాలు ఉన్నాయి. ఒకటి కరోనావైరస్తో వచ్చిన సంక్షోభం ఉంటుండగా త్వరలోనే రెండో సంక్షోభం కూడా ఆ రాష్ట్రాన్ని కుదిపేస్తుందేమో అన్న అనుమానం వస్తోంది. రెండో సంక్షోభం రాజకీయ సంక్షోభం. మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం నడుస్తోంది. ఈ సంకీర్ణ ప్రభుత్వంలో ఉద్దవ్ థాక్రే ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఆయన అసెంబ్లీకి కానీ, కౌన్సిల్కు కానీ ఎన్నుకోబడలేదు. సీఎంగా బాధ్యతలు చేప్పటిన తర్వాత ఆరు నెలల్లోగా ఏదో ఒక సభకు ఎన్నిక కావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం మహారాష్ట్రలో కరోనావైరస్ సంక్షోభం ఉన్న నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఉద్ధవ్ థాక్రేకు చాలా తక్కువ అవకాశాలున్నాయి. ఉద్ధవ్ థాక్రేను మండలికి నామినేట్ చేయాలంటూ ఇప్పటికే ఆ రాష్ట్ర గవర్నర్ కోష్యారీకి విజ్ఞప్తి చేసింది మహారాష్ట్ర కేబినెట్. అయితే ఇప్పటి వరకు గవర్నర్ నుంచి ఎలాంటి స్పష్టమైన సంకేతాలు రాలేదు.
కీలకం కానున్న గవర్నర్ కోష్యారీ
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనావైరస్ కట్టడిపైనే దృష్టంతా ఉంది. ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేనే ముందుండి వ్యాధి నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ఇక ఆయన పదవికి కూడా గండం పొంచి ఉంది. ఇది కూడా ఆయనకు ఒక సవాల్గా మారింది. త్వరలోనే ఆయన తిరిగి ఏదో ఒక సభకు ఎన్నిక కావాల్సిందే.. లేదంటే సీఎం పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఉద్దవ్ మిత్రపక్షాల సపోర్టును పొందాల్సి ఉంది. రెండోది ఆయన మండలికి నామినేట్ కావాలంటే గవర్నర్ మద్దతు తప్పనిసరి. అయితే గవర్నర్గా ఉన్న కోష్యారీ గతంలో బీజీపీలో చాలా యాక్టివ్గా పనిచేసిన వ్యక్తి. మరి ఈ సమయంలో ఉధ్ధవ్ థాక్రే పట్ల ఆయన ఎలా వ్యవహరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్ధవ్ థాక్రేకు ఉన్న ఒకే ఒక అవకాశం.. మండలికి నామినేట్ అవడం మాత్రమే. కానీ దీనికి కూడా కొన్ని అడ్డంకులు ఉన్నాయి.
మండలిలో సభ్యులుగా ఉన్న సీఎంలు వీరే
ఇదిలా ఉంటే గవర్నర్ ద్వారా నామినేట్ అయిన వ్యక్తి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన దాఖలాలు లేవు. ఈ పద్ధతిలో ఉద్ధవ్ థాక్రే సీఎం అయితే కొత్త చరిత్ర సృష్టించిన వ్యక్తిగా నిలుస్తారు. గతంలో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రులుగా అఖిలేష్ యాదవ్, మాయావతి, బీహార్ సీఎంగా నితీష్ కుమార్, కర్నాటక ముఖ్యమంత్రిగా సదానంద గౌడలు పదవిలో ఉండగా ఆరునెలల్లోగా మండలికి ఎన్నికయ్యారు. వీరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. అయితే మహారాష్ట్ర కేబినెట్ మాత్రం గవర్నర్ కోటాలో నామినేట్ చేయాల్సిందిగా కోరుతోంది. రాజ్యసభకు రాష్ట్రపతి కోటాలో ఎలా అయితే సభ్యులను నామినేట్ చేస్తారో.. శాసనమండలికి కూడా గవర్నర్ కోటాలో సభ్యులను నామినేట్ చేస్తారు.
నామినేట్ చేయాలంటే కండీషన్ ఇదీ..!
నామినేట్ అయ్యే వ్యక్తులు పలు రంగాల్లో నిష్ణాతులై ఉంటారు. లేదా సమాజానికి ఏదో ఒక రకంగా సేవ చేసినవారై ఉంటారు. వారు రాజకీయ పార్టీతో సంబంధం లేని వ్యక్తులై ఉంటారు. ఇలా నామినేట్ అయిన వారు ఆయా రాజకీయపార్టీల్లో యాక్టివ్గా కనిపించిన వారు ఉన్నారు కానీ ఒక ముఖ్యమంత్రి అయిన వారు మాత్రం ఎప్పుడూ లేరు. అయితే మహారాష్ట్ర గవర్నర్ ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటారా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. అంతేకాదు ఒకరిని నామినేట్ చేయాలంటే ఆ సీటు కనీసం ఒక ఏడాదైనా ఖాళీగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో నామినేట్ కావాల్సిన సీటు ఏడాది సమయం కంటే తక్కువగానే ఖాళీగా ఉంది. ఇప్పుడు ఉద్ధవ్ కోసం ఆ నిబంధన గవర్నర్ మారుస్తారా అనేది ఇంట్రెస్టింగ్గా మారింది.
ఉద్ధవ్ థాక్రే ముందు ఉన్న ఆప్షన్స్ ఏంటి..?
ఇక కేంద్ర స్థాయిలో చూసుకుంటే ప్రధానిగా ఇప్పటి వరకు ఎవరూ నామినేటెడ్ పదవి ద్వారా రాలేదు. అయితే 1971లో ప్రొఫెసర్ నూరాల్ హసన్ కేంద్ర సహాయశాఖ మంత్రిగా పనిచేశారు. ఈయన్ను అప్పటి రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేశారు. 1968 నుంచి 1971వరకు పదవిలో కొనసాగారు. అయితే కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే హసన్ నామినేటెడ్ పదవికి రాజీనామా చేశారు. వెంటనే రాజ్యసభ సభ్యుడిగా తిరిగి ఎన్నికయ్యారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఉద్ధవ్ థాక్రే ముందు మరో ఆప్షన్ మిగిలి ఉంది. ముందుగా ఆయన సీఎం పదవికి రాజీనామా చేసి ఆ తర్వాత తిరిగి తన మిత్రపక్షాలతో సమావేశం నిర్వహించి సీఎంగా తననే ఎన్నుకునేలా థాక్రే ప్లాన్ చేయాలి. ఇలా చేస్తే థాక్రే అసెంబ్లీకి కానీ మండలికి కానీ ఎన్నికయ్యేందుకు మరో 6 నెలల సమయం ఉంటుంది. ఈ సమయంలో పరిస్థితులు చక్కబడితే తనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది కాకుండా తన కొడుకుని ముఖ్యమంత్రిని చేయడం ద్వారా సీఎం పదవి తన కుటుంబం వద్దే ఉండేలా చూసుకోవడం మరో ఆప్షన్. అయితే దీనికి మిత్రపక్షాలు ఒప్పుకుంటాయా అనేది ఇంట్రెస్టింగ్గా మారుతుంది. లేదా శివసేన నుంచే మరో వ్యక్తిని సీఎంగా నియమించి పరిస్థితి చక్కబడే వరకు వేచి చూడటం మరో ఆప్షన్గా కనిపిస్తోంది.
మొత్తానికి కరోనావైరస్ సంక్షోభంలో ఉద్దవ్ థాక్రేకు వ్యక్తిగతంగా సంక్షోభం వచ్చిందని అభిప్రాయపడుతున్నారు రాజకీయ విశ్లేషకులు.