బీజేపీని ఆ భయం వెంటాడుతున్నదా? అందుకే మహా సీఎం పీఠంపై పేచీనా?
మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్ఠంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యమంత్రి పదవి కోసం బీజేపీ, శివసేన మధ్య పట్టువిడుపుల సమరం తీవ్రస్థాయికి చేరుకొన్నది. సీఎం కుర్చీ మాకంటే మాకే అనే పట్టుదలతో ముందుకెళ్తున్నాయి. మళ్లీ అధికారంలోకి వస్తే పదవులను సమానంగా పంచుకొందామని చెప్పిన హామీని బీజేపీ తుంగలో తొక్కుతుందనే వాదనను శివసేన తెరపైకి తెచ్చింది. అయితే సమానంగా సీఎం పదవిని పంచుకొంటే గతంలో యూపీ, కర్ణాటకలో బీజేపీకి ఎదురైన చేదు అనుభవాలు మళ్లీ పునరావృతం అవుతాయా అనే భయం బీజేపీని వెంటాడుతున్నట్టు కనిపిస్తున్నది. అయితే మహారాష్ట్రలో బీజేపీ, శివసేన మధ్య ఎలాంటి సీన్లు చోటు చేసుకొంటున్నాయంటే..
బీజేపీతో అవగాహన ఒప్పందం
బీజేపీతో ఉన్న అవగాహన ఒప్పందాన్ని తాజాగా శివసేన నేత హర్షల్ ప్రధాన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకొన్నాయి. లోక్సభ ఎన్నికల ముందు బీజేపీతో జరిగిన ఒప్పందాన్ని బయటపెట్టాడు. మహారాష్ట్రలో మళ్లీ అధికారంలోకి వస్తే సమానంగా పార్ట్నర్షిప్ ఉండాలి అని అవగాహనకు వచ్చాం అని ప్రధాన్ పేర్కొన్నాడు. అయితే దానికి బీజేపీ నేత, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ.. శివసేనకు మేము సీఎం పదవి విషయంలో ఎలాంటి హామీ ఇవ్వలేదు అని స్పష్టం చేశారు.
శివసేన సీఎం మాత్రమే
ఇటీవల జరిగిన శివసేన వ్యవస్థాపక దినోత్సవం కార్యక్రమంలోని విషయాన్ని శివసేన తాజాగా ప్రస్తావిస్తున్నది. ఆ కార్యక్రమానికి సీఎం ఫడ్నవీస్ కూడా హాజరయ్యారు. ఆ సందర్భంగా రానున్న రోజుల్లో శాసనసభను కాషాయ పార్టీతో నింపేస్తాం. 54వ వ్యవస్థాపక దినోత్సవం రోజున శివసేన పార్టీకి చెందిన సీఎం ఆ కార్యక్రమంలో పాలుపంచుకొంటారు అని అధికార పత్రిక సామ్నాలో పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా బయటపెడుతున్నారు.
వెంటాడుతున్న యూపీ ఘటన
ఒకవేళ శివసేనకు ముఖ్యమంత్రి పీఠం అప్పగిస్తే... తిరిగి తమకు వస్తుందా అనే మీమాంసలో బీజేపీ నేతలు ఉన్నారు. 1997లో ఉత్తర ప్రదేశ్లో సంఘటనను ఆధారంగా చేసుకొని శివసేనకు సీఎం పదవి ఇచ్చే అంశంలో మల్లగుల్లాలు పడుతున్నది. 1997లో యూపీలో ఎవరికీ పూర్తి మెజారిటీ రాని సమయంలో బీజేపీ మద్దతుతో బీఎస్పీ తరుఫున మాయవతి సీఎం పీఠం చేపట్టింది. ఆ తర్వాత బీజేపీ అభ్యర్థి కల్యాణ్కు పగ్గాలు అప్పగించారు. కానీ బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్ చేసిన సూచించారు. ఆ సమయంలో బీజేపీకి బీఎస్పీ మద్దతు ఉపసంహరించుకొని షాకిచ్చింది.
కర్ణాటకలో అదే సీన్
ఇక కర్ణాటకలో కూడా 2004లో ఇదే కథ పునరావృతమైంది. బీజేపీ ఆ సమయంలో అత్యధిక స్థానాలు గెలుచుకొన్న పార్టీగా అవతరించింది. జేడీఎస్తో కలిసి అధికారాన్ని పంచుకొన్నది. అయితే అప్పటి సీఎం ధరమ్ సింగ్ అవినీతి ఆరోపణల్లో కూరుకుపోవడంతో ప్రభుత్వం పడిపోయింది. దాంతో బీజేపీ నేత యెడ్యూరప్ప చక్రం తిప్పి జేడీఎస్ సపోర్ట్ తీసుకొన్నది.
కుమారస్వామితో చేదు అనుభవం
బీజేపీ, జేడీఎస్ మధ్య ఒప్పంద ప్రకారం సీఎం సీటును సమానంగా పంచుకోవాలని ఒప్పందం జరిగింది. దాంతో జేడీఎస్ నేత కుమారస్వామి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. తన కాలపరిమితి ముగిసిన తర్వాత బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు నిరాకరించారు. దాంతో బీజేపీకి చేదు అనుభవం ఎదురైంది. ఇప్పుడు శివసేనతో కూడా అలానే జరుగుతుందా అనే భయంతో సీఎం పదవిపై పేచీ పెడుతున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నది.