కర్ణాటక రాజకీయాలు మహారాష్ట్రలో రిపీట్ ? ఆరోజు, ఈరోజు సుప్రీం కోర్టు తీర్పు, బీజేపీ కథ క్లైమాక్స్!
బెంగళూరు/ముంబై: కర్ణాటకలో గత ఏడాది జరిగిన రసవత్తర రాజకీయాలు ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో రిపీట్ అవుతాయా ? అంటే బుధవారం సాయంత్రం వరకు వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కర్ణాటక అసెంబ్లీలో 24 గంటల్లో విశ్వాస పరీక్షలో మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు నిరూపించుకోవాలని గత ఏడాది అప్పటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు బుధవారం సాయంత్రం 5 గంటలకు అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు నిరూపించుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశాలు చేసింది. అయితే కర్ణాటకలో విశ్వాస పరీక్షకు ముందే బీఎస్. యడియూరప్ప సీఎం పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ బుధవారం సాయంత్రం 5 గంటలకు ఏం చేస్తారు ? అనే విషయంపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైయ్యింది.
హైటెక్ వ్యభిచారం: అమ్మాయిలకు పొర్న్ పాఠాలు చెప్పిన లేడీ ప్రొఫెసర్ అరెస్టు, జైలు, గేమ్స్!
బీజేపీకి చుక్కెదురు
బీజేపీకి సర్వోన్నత న్యాయస్థానంలో చుక్కెదురైయ్యింది. మహారాష్ట్ర వ్యవహారాలపై సుప్రీం కోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం బుధవారం సాయంత్రం 5 గంటలకు బలనిరూపణ చేసుకోవాలని సుప్పీం కోర్టు స్పష్టం చేసింది. బలపరీక్షను టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చెయ్యాలని సుప్రీం కోర్టు సూచించింది. రహస్య ఓటింగ్ లేదని, రేపు సాయంత్రం బలపరీక్షను ఎదుర్కోవాలని సుప్రీం కోర్టు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు స్పష్టం చేసింది.
ఆరోజు వాజూభాయ్, ఈ రోజు భగత్ సింగ్ కౌష్యారీ
కర్ణాటక రాజకీయాలకు, మహారాష్ట్ర రాజకీయాలకు చాల దగ్గర పోలికలు కనపడుతున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు గత ఏడాది కర్ణాటకలో అదేవిదంగా జరిగాయి. గత ఏడాది కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యాలని బీఎస్. యడియూరప్ప శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. ఆ రోజు బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడానికి ఆ రాష్ట్ర గవర్నర్ వాజూభాయ్ వాలా బీఎస్. యడియూరప్పకు అవకాశం ఇచ్చారు. ఈ రోజు మహారాష్ట్రలో బీజేపీ-ఎన్సీపీ (రెబల్ వర్గం) సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడానికి ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కౌష్యారీ దేవేంద్ర ఫడ్నవీస్ కు అవకాశం ఇచ్చారు.
కర్ణాటకలో క్లిష్ట పరిస్థితులు
2018 మే 12వ తేదీ కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మే 15వ తేదీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించారు. బీజేపీ 104, కాంగ్రెస్ 76, జేడీఎస్ 37 స్థానాల్లో విజయం సాధించాయి. నాలుగు నియోజక వర్గాల్లో స్వతంత్రులు విజయం సాధించారు. రామనగర, చెన్నపట్టణ నియోజక వర్గాల్లో హెచ్.డీ. కుమారస్వామి విజయం సాధించారు. తరువాత రామననగర శాసన సభ్యత్వానికి రాజీనామా చేసిన హెచ్.డీ. కుమారస్వామి చెన్నపట్టణ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆ రోజుల్లో కర్ణాటక రాజకీయాల్లో బీజేపీకి క్లిష్టపరిస్థితులు ఎదురైనాయి.
యడియూరప్పకు చాన్స్
104 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారని, తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడానికి అవకాశం ఇవ్వాలని బీఎస్. యడియూరప్ప గవర్నర్ వాజూభాయ్ వాలాకు మనవి చేశారు. గవర్నర్ అనుమతి ఇవ్వడంతో 2018 మే 17వ తేదీని కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్. యడియూరప్ప ప్రమాణస్వీకారం చేశారు. అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోవడానికి సీఎం యడియూరప్పకు గవర్నర్ వాజూభాయ్ వాలా 15 రోజులు గడువు ఇచ్చారు. అయితే యడియూరప్పతో పాటు ఎవ్వరూ మంత్రులుగా ప్రమాణస్వీకారం చెయ్యలేదు.
అదే న్యాయమూర్తి జస్టిస్ అశోక్ భూషణ్
కర్ణాటక గవర్నర్ వాజూభాయ్ వాలా నిర్ణయాన్ని సవాలు చేస్తూ గత ఏడాది కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు సుప్రీం కోర్టను ఆశ్రయించాయి. యడియూరప్ప వెంటనే అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోవాలని ఆదేశాలు జారీ చెయ్యాలని కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు సుప్రీం కోర్టులో మనవి చేశాయి. అర్జీ విచారణ చేసిన సుప్రీం కోర్టు 2018 మే 19వ తేదీ సాయంత్రం 4 గంటలకు యడియూరప్ప కర్ణాటక అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు బుధవారం సాయంత్రం 5 గంటల లోపు బలనిరూపణ చేసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది కర్ణాటక విషయంలో తీర్పు ఇచ్చిన ప్రత్యేక బెంచ్ లో సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ అశోక్ భూషణ్ ఉన్నారు. మంగళవారం మహారాష్ట్ర ప్రభుత్వం విషయంలో సుప్రీం కోర్టు త్రిసభ్య కమిటీ ఇచ్చిన బెంచ్ లో న్యాయమూర్తి జస్టిస్ అశోక్ భూషణ్ ఉన్నారు.
ఆ రోజు యడియూరప్ప కథ క్లోజ్
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 2018 మే 19వ తేదీ అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప బలపరీక్షను ఎదుర్కోవడానికి సిద్దం అయ్యారు. అయితే మెజారిటీ ఎమ్మెల్యే మద్దతు కూడకట్టుకోవడంలో బీజేపీ విఫలం అయ్యింది. బలపరీక్షకు ముందే బీఎస్. యడియూరప్ప సీఎం పదవికి రాజీనామా చేస్తున్నానని అసెంబ్లీలోనే చెప్పారు. కేవలం మూడు రోజుల మాత్రమే సీఎంగా ఉన్న యడియూరప్ప ఆయన రాజీనామా లేఖను గవర్నర్ వాజూభాయ్ వాలాకు అందించారు. అంతుకు ముందు యడియూరప్ప 7 రోజులు సీఎం (మొదటిసారి), రెండో సారి 39 నెలలు సీఎంగా పని చేశారు. మూడో సారి మాత్రం సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన యడియూరప్ప కేవలం మూడు రోజుల్లోనే ఆయన పదవికి రాజీనామా చేశారు. యడియూరప్ప రాజీనామా చెయ్యడంతో తరువాత హెచ్.డీ. కుమారస్వామి కర్ణాటక సీఎం అయ్యారు.
ఈ రోజు దేవేంద్ర ఫడ్నవీస్ పరిస్థితి అదే ?
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు బలపరీక్ష అగ్నిపరీక్షగా మారింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దేవేంద్ర ఫడ్నవీస్ కు బుధవారం సాయంత్రంలోపు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు సంపాధించుకోవాలి. లేదంటే గత ఏడాది కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి బీఎస్. యడియూరప్ప ఎలా రాజీనామా చేశారో అలాగే దేవేంద్ర ఫడ్నవీస్ ఆయన పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అయితే ఎలాగైనా మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం కొనసాగించాలని ఆ పార్టీ నాయకులు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు సంపాధించుకోవాలని తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఏడాది కర్ణాటకలో బీజేపీకి ఎదురైన పరిస్థితి ఈ రోజు మహారాష్ట్రలో రిపీట్ అయితే బీజేపీ పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది.