''మహా '' రాజకీయాలు: సోనియాతో భేటీ కానున్న శరద్ పవార్..కీలక నిర్ణయం వచ్చే అవకాశం
న్యూఢిల్లీ: ఎన్సీపీ చీఫ్ శరద్పవార్ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని సోమవారం కలవనున్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుపై చర్చించనున్నారు. మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనకు నేటితో ముగింపు పలకాలని శరద్పవార్ భావిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రితో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. పవార్ నివాసంలో పార్టీ అంతర్గత సమావేశం తర్వాత ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ ఆదివారం ప్రకటన చేశారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు తెరపడాలని తమ పార్టీ భావిస్తోందని చెప్పారు. ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు కావాలన్న మంచి ఉద్దేశంతో తమ పార్టీ ముందుకు వెళుతోందని నవాబ్ మాలిక్ చెప్పారు.
ఆ రెండు పార్టీలతో కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం: శరద్ పవార్
ముఖ్యమంత్రి పదవిపై శివసేన బీజేపీల మధ్య విబేధాలు రావడంతో శివసేన ఎన్సీపీ కాంగ్రెస్లు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి. సోమవారం రోజున శరద్ పవార్, సోనియాగాంధీలు సమావేశం అవుతారని ఆ సందర్భంగా తుది నిర్ణయం వెలువడుతుందని నవాబ్ మాలిక్ చెప్పారు. ఇక మంగళవారం రోజున రెండు పార్టీలకు చెందిన ఇతర నాయకులు సమావేశమై భవిష్యత్ ప్రణాళికపై చర్చిస్తారని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ స్పష్టం చేశారు. ఆదివారం రెండు గంటల పాటు జరిగిన ఎన్సీపీ కీలక సమావేశానికి జయంత్ పాటిల్, దిలీప్ వాల్సే పాటిల్ , చగన్ భుజ్భల్, అజిత్ పవార్, సుప్రియా సూలే, సునీల్ తత్కారే, ధనంజయ్ ముండేలు హాజరయ్యారు.
ఇదిలా ఉంటే శివసేన కాంగ్రెస్ ఎన్సీపీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందకు చర్చలు ప్రారంభించామని కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చవాన్ చెప్పారు. సోమవారం రోజున శివసేన నాయకులతో కాంగ్రెస్ నాయకులు భేటీ అవుతారని వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పాటు దిశగా ఎలా వెళ్లాలనేది అసలు ముందుడగు వేయగలమా లేదా అనేదానిపై చర్చిస్తామని మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ చెప్పారు. మహారాష్ట్రలో ప్రస్తుతం రాష్ట్రపతి పాలన ఉంది. నవంబర్ 12వ తేదీన రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు రాకపోవడంతో గవర్నర్ భగత్సింగ్ కోష్యారి రాష్ట్రపతి పాలనకు సూచించారు.