మహారాష్ట్ర అదృష్టం ఎలా ఉందో.. జరగాల్సిందే జరుగుతుంది.. శివసేన నేత సంచలన వ్యాఖ్యలు
ముంబై : మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీ, శివసేన చెరో దారిగా వ్యవహరిస్తుండటంతో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 50-50 ఫార్ములా అంటూ శివసేన నేతలు అధికారంలో సగ భాగమంటూ వాదిస్తున్నారు. అది ఎన్నికలకు ముందే జరిగిన పొత్తుల అంశమని స్పష్టం చేస్తున్నారు. అయితే బీజేపీ నేతలు మాత్రం సీఎం కుర్చీలో భాగమేంటని ఎదురు ప్రశ్నిస్తున్నారు. అదలావుంటే శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ బుధవారం నాడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మహారాష్ట్ర అదృష్టం ఎలా ఉంటే అలానే జరుగుతుందంటూ ఆయన మాట్లాడిన తీరు చర్చానీయాంశమైంది.
మహారాష్ట్ర రాజకీయం రసవత్తరం
మహారాష్ట్రలో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయా అనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నికలకు ముందు బీజేపీతో జతకట్టిన శివసేన అధికారంలో వాటా కోసం గట్టిగా వాదిస్తోంది. పొత్తులకు వెళ్లేముందే 50-50 ఫార్ములా ప్రతిపాదించామని.. ఆ క్రమంలోనే కాషాయం దండుతో జతకట్టామనేది శివసేన నేతల వాదన. అయితే మంగళవారం (29.10.2019) నాడు మహా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలు ఆ రెండు పార్టీల మధ్య దూరం పెంచాయని చెప్పొచ్చు.
50-50 ఫార్ములా లేదు.. అధికారంలో సగం వాటా ఇచ్చేది లేదు.. బీజేపీ లీడరే ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారని ఫడ్నవీస్ మాట్లాడిన తీరు శివసేన నేతలకు ఆగ్రహం తెప్పించింది. ఆ క్రమంలో మంగళవారం నాడు బీజేపీతో జరగాల్సిన చర్చలను బాయ్కాట్ చేశారు. మాటల్లేవ్, చర్చల్లేవ్ అంటూ తేగేసి చెప్పారు.
పక్కింటి కుర్రాడితో అలా.. మద్యం తాగి.. కన్నతల్లి హత్య కేసులో మరెన్నో ట్విస్టులు..!
శివసేన దూకుడు.. బీజేపీ విరుగుడు
శివసేన దూకుడు చూస్తుంటే మహా ప్రభుత్వ ఏర్పాటులో సందిగ్ధం నెలకొంటుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అదే క్రమంలో బుధవారం నాడు శివసేన సీనియర్ లీడర్ సంజయ్ రౌత్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. జరిగేది జరుగుతుంది, చూద్దాంలే అన్నట్లుగా ఆయన మాట్లాడిన తీరు చర్చానీయాంశమైంది. మహారాష్ట్ర ఫేట్ ఎలా ఉంటే అలా జరుగుతుందని చెప్పడం కొసమెరుపు. బీజేపీ సమావేశం గురించి తనకు తెలియదని.. శివసేన ఎమ్మెల్యేలతో బుధవారం నాడు సమావేశం ఉండదని తేల్చేశారు. అదలావుంటే బీజేపీ శాసనసభా పక్ష నేతగా దేవేంద్ర ఫడ్నవీస్ను ఎన్నుకున్నారు. అదే క్రమంలో గురువారం నాడు శివసేన శాసనసభా పక్ష నేతను ఎన్నుకునే అవకాశం కనిపిస్తోంది.
శివసేన కాదంటే బీజేపీ పరిస్థితి ఏంటి?
మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్గా 145 ఎమ్మెల్యేల సంఖ్యాబలం అవసరం ఉంటుంది. అయితే బీజేపీ 105 సీట్లు, శివసేన 56 సీట్లు గెలుచుకున్నాయి. ఈ రెండు పార్టీలు కలిస్తే బీజేపీ కూటమి బలం 161కి చేరుతుంది. దాంతో ప్రభుత్వ ఏర్పాటు సులువు అవుతుంది. అయితే 50-50 ఫార్ములాను తెరపైకి తెచ్చి అధికారంలో చెరో సగం అంటూ శివసేన పట్టుబట్టడంతో బీజేపీ ససేమిరా అంటోంది. ఆ క్రమంలో అలాంటి హామీ శివసేనకు బీజేపీ ఎప్పుడూ ఇవ్వలేదని తేల్చి చెప్పారు ఫడ్నవీస్. దాంతో శివసేన నేతలు గుర్రుగా ఉన్నారు. బీజేపీ నో అంటే ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటనేది ఆ పార్టీ నేతలు సుదీర్ఘంగా ఆలోచిస్తున్నారు. ఆ మేరకు స్కెచ్ కూడా వేశారనే టాక్ నడుస్తోంది.
31 తర్వాత ఎప్పుడైనా సరే.. మున్సిపోల్స్కు సిద్దంగా ఉండండి.. కలెక్టర్లకు ఈసీ సూచన..!
బీజేపీ ఎల్పీ నేతగా ఫడ్నవీస్.. మొదట సీఎం కుర్చీ ఎక్కించాక..!
అటు బీజేపీ, ఇటు శివసేన.. తలోదారి పట్టడంతో ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం జరుగుతూ వచ్చింది. ఈ నెల 24వ తేదీన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఆ క్రమంలో దాదాపు వారం రోజులు గడుస్తున్నా ప్రభుత్వం ఏర్పాటు కాకపోవడంపై బీజేపీ, శివసేన అనుసరిస్తున్న వైఖరి కారణమనేది సుస్పష్టం. ఏది ఏమైనా తొలుత ఫడ్నవీస్ను సీఎం కుర్చీ ఎక్కించాలనేది బీజేపీ పెద్దల వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే ఆయన్ని బీజేపీ శాసనసభా పక్ష నేతగా బుధవారం నాడు ఎన్నుకున్నారు. అసెంబ్లీలో బల నిరూపణకు ఎలాగూ సమయం ఉంటుంది కాబట్టి, అంతలోపు శివసేనను బుజ్జగించి దారిలోకి తెచ్చుకోవాలన్నది ఢిల్లీ పెద్దల అంతరంగంగా కనిపిస్తోంది. ఆ మేరకు బీజేపీ బాద్షా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వ్యూహరచనలో మునిగినట్లు తెలుస్తోంది.