ప్రభుత్వం ఏర్పాటుపై బీజేపీ ధీమా ఏంటి.. హార్స్ట్రేడింగ్కు తెరదీసిందా: శివసేన
మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో బీజేపీ పలువురు స్వతంత్ర ఎమ్మెల్యేలతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేల మద్దతుతో స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ నేత చంద్రకాంత్ పాటిల్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి శివసేన మాతృపత్రిక సామ్నాలో ఓ కథనం ప్రచురితమైంది. బీజేపీ మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం అసంభవం అని శివసేన చెప్పినట్లుగా రాసుకొచ్చిన సామ్నా.. వారి కాన్ఫిడెన్స్ చూస్తే ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసేందుకు కంకణం కట్టుకున్నట్లుగా తెలుస్తోందని శివసేన పార్టీ మండిపడింది.
అనాలిసిస్: మహారాష్ట్రలో హైడ్రామా.. గవర్నర్ ఏం చేయబోతున్నారు..?
ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని చెప్పి ఇదేంటి..?
ఇక శివసేన ఎన్సీపీ ప్రభుత్వం ఆరునెలలకు మించి ప్రభుత్వంలో ఉండలేవన్న మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యలపై కూడా శివసేన మండిపడింది. మహారాష్ట్రలో కొత్త రాజకీయ సమీకరణాలు పుట్టుకురావడంతో కొంతమందికి కడుపు మంటగా ఉందని శివసేన ఎద్దేవా చేసింది. మహారాష్ట్రలో త్వరలోనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని శుక్రవారం చంద్రకాంత్ పాటిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు 119 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చంద్రకాంత్ పాటిల్ చెప్పారు. 105 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని గవర్నర్కు తెలిపిందని ఇప్పుడు ఏ ధైర్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనే కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తోందని శివసేన ప్రశ్నించింది.
బీజేపీ హార్స్ ట్రేడింగ్కు పాల్పడుతోంది
ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని చేతులెత్తేసిన బీజేపీ ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ముందుకు వస్తుందంటే ఇక హార్స్ ట్రేడింగ్కు దిగుతోందనేది స్పష్టమవుతోందని చెప్పింది. తమ ఎమ్మెల్యేలతో పాటు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కూడా ప్రలోభాలకు గురిచేసేందుకు బీజేపీ స్కెచ్ రెడీ చేసిందని శివసేన ధ్వజమెత్తింది. పారదర్శకతతో ప్రభుత్వం నడుపుతామని గొప్ప గొప్ప మాటలు చెప్పిన పార్టీలు.. ఇప్పుడు ఎమ్మెల్యేలను కొనేందుకు సిద్ధం అవుతున్నారని శివసేన పార్టీ ఫైర్ అయ్యింది.
నితిన్ గడ్కరీపై శివసేన సెటైర్
మహారాష్ట్రలో నెలకొన్న ప్రతిష్టంభన పై శుక్రవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ... క్రికెట్లో రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చనే వ్యాఖ్యలు చేశారు. గడ్కరీ క్రికెట్కు సంబంధించిన వ్యక్తి కాదని ఆయన సిమెంట్, ఇథనాల్, ఆస్ఫాల్ట్లకు సంబంధించిన వ్యక్తి అని శివసేన సెటైర్ వేసింది. మ్యాచ్ ఓడిపోతుందని అంతా అనుకుంటున్న సమయంలో మ్యాచ్ గెలవడం జరుగుతుందని అదే మహారాష్ట్రలో కూడా జరుగుతుందని చెబుతూ క్రికెట్కు మహారాష్ట్ర రాజకీయాలకు లింక్ పెట్టారు నితిన్ గడ్కరీ.
క్రికెట్లో ఫిక్సింగ్లానే రాజకీయాల్లో కూడా..
గడ్కరీ వ్యాఖ్యలపై స్పందించిన శివసేన... క్రికెట్ ఇప్పుడు క్రీడ కంటే వ్యాపారంగా మారిపోయిందని కౌంటర్ ఇచ్చింది. క్రికెట్లో కూడా హార్స్ ట్రేడింగ్, ఫిక్సింగ్లు జరుగుతాయని శివసేన గుర్తు చేసింది. అందుకే క్రికెట్ మ్యాచ్ ప్రారంభం అయ్యాక ఆట గెలుస్తుందా లేక ఫిక్సింగ్ గెలుస్తుందా అనే అనుమానం కలుగుతుందని శివసేన వ్యాఖ్యానించింది. అందేకు మహారాష్ట్ర రాజకీయాలను క్రికెట్ గేమ్తో గడ్కరీ సరిగ్గా పోల్చారని శివసేన చెప్పినట్లు సామ్నా రాసుకొచ్చింది.