'మహా' సంకీర్ణం డీల్ డన్: శివసేనకు సీఎం పోస్టు..కాంగ్రెస్ ఎన్సీపీల నుంచి డిప్యూటీ సీఎం
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు ఓ కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. కామన్ మినిమమ్ ప్రోగ్రాంకు మూడు పార్టీలు అంగీకరించడంతో ఇక ప్రభుత్వ ఏర్పాటు ఖాయమనే తెలుస్తోంది. ప్రస్తుతం మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఉంది. అయితే ఈ మూడు పార్టీలు ప్రభుత్వం ఏర్పాటుకు ఎలాంటి ముందడుగు వేయబోతున్నాయనేది ఆసక్తి కరంగా మారింది.
మహారాష్ట్రలో రాజకీయ అనిశ్చితికి తెర..?
2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి అక్కడ ప్రభుత్వ ఏర్పాటు విషయంలో గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి ఇచ్చిన గడువులోగా ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడంతో అక్కడ రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. ఇక శివసేన ఎన్డీయేకు గుడ్ బై చెప్పడంతో ఎన్సీపీ-కాంగ్రెస్లతో తప్పని పరిస్థితుల్లో కలవాల్సి వచ్చింది.
శివసేనకు సీఎం, కాంగ్రెస్ ఎన్సీపీలకు డిప్యూటీ సీఎం
ఇక మూడు పార్టీలు శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్లు చర్చోపచర్చల తర్వాత ఒక ఏకాభిప్రాయంకు వచ్చాయి. కామన్ మినిమమ్ ప్రోగ్రాంకు మూడు పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. ప్రభుత్వ ఏర్పాటులో అడ్డంకిగా ఉన్న సమస్యలకు పరిష్కారం కనుగొని ఇక ముందుకు వెళ్లనున్నాయి. సంకీర్ణ ప్రభుత్వంలో శివసేన పార్టీ నుంచి పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఉంటారని సమాచారం. ఇక కాంగ్రెస్ ఎన్సీపీల నుంచి డిప్యూటీ ముఖ్యమంత్రి ఉంటారు. ఇక మంత్రుల విషయానికొస్తే శివసేనకు 14 మంత్రి పదవులు, ఎన్సీపీకి 14 మంత్రి పదవులు, కాంగ్రెస్కు 12 మంత్రి పదవులు దక్కనున్నాయి.
వారాంతంలో శరద్ పవార్ - సోనియా భేటీ
ఇక మూడు పార్టీల కామన్ మినిమమ్ ప్రోగ్రాం కింద రైతు సమస్యలు, యువతకు సంబంధించిన సమస్యలపై ఫోకస్ చేయనున్నాయి.అయితే ఇందులో హిందుత్వానికి సంబంధించిన సమస్యలను పొందుపర్చలేదు. ఇక ఏ పార్టీకి ఎన్ని పదవులు కూడా డిసైడ్ అవ్వడంతో ఈ వారాంతంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీలు సమావేశం కానున్నారు.
రెండు అంశాలపై కుదరని ఏకాభిప్రాయం
మరోవైపు రెండు ప్రధాన అంశాలపై పార్టీల నుంచి ఏకాభిప్రాయం కుదరలేదు. సావర్కర్కు భారతరత్న ఇవ్వాలని శివసేన డిమాండ్ చేస్తుండగా... ఎన్సీపీ-కాంగ్రెస్లు ముస్లింలకు 5శాతం రిజర్వేషన్ అమలు చేయాలని పట్టుబడుతున్నాయి. అయితే వీటిపై భవిష్యత్తులో ఏమైనా విబేధాలు తలెత్తితే మళ్లీ కథ మొదటికి వచ్చే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికైతే మహారాష్ట్ర అసెంబ్లీ సస్పెండెడ్ యానిమేషన్ మోడ్లో ఉండగా గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ప్రస్తుతం మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన
మంగళవారం నుంచి మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు మరింత సమయం కావాలని ఎన్సీపీ కోరడంతో గవర్నర్ ఇందుకు అంగీకరించలేదు. వెంటనే మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనను సూచిస్తూ కేంద్రానికి నివేదిక పంపారు. కేంద్రం వెంటనే ఆమోదించడం ఆ ఫైలును రాష్ట్రపతికి పంపడం ,రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సంతకం చేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి.