మహారాష్ట్ర రాజకీయం: కాంగ్రెస్-శివసేనల మధ్య చర్చలు , ఎన్సీపీ అసంతృప్తి
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉన్న ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీ-కాంగ్రెస్-శివసేనలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఒక పార్టీతో మరొక పార్టీ చర్చలు జరుపుతోంది. ఈ క్రమంలోనే ఎన్సీపీ -కాంగ్రెస్లు బీజేపీకి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు శివసేనతో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాయి. ఇక ప్రక్రియ మొదలు పెట్టేందుకు ప్రారంభించిన చర్చలు సత్ఫలితాలను ఇచ్చేలా కనిపిస్తోంది.
అనాలిసిస్: మహారాష్ట్రలో హైడ్రామా.. గవర్నర్ ఏం చేయబోతున్నారు..?
అప్పటి వరకు ఒక లెక్క.. బుధవారం మరో లెక్క
మంగళవారం రోజున జరిగిన చర్చల్లో కాంగ్రెస్ ఎన్సీపీలు కలిసి పోటీ చేసినందున ప్రభుత్వ ఏర్పాటులో ఇద్దరూ కీలకం కానున్నారు. రెండు పార్టీలు ముందుగా ఒక కామన్ మినిమమ్ ప్రోగ్రామ్తో వచ్చి ఆ తర్వాత ఆ ప్రతిపాదనను శివసేన ముందుకు ఉంచుతామని చెప్పాయి. శివసేన ప్రతిపాదనకు అంగీకరిస్తే సంతకాలు చేస్తుందని వెల్లడించాయి. అయితే బుధవారం పరిస్థితి కాస్త భిన్నంగా కనిపించింది.
కాంగ్రెస్తో ఉద్ధవ్ ఠాక్రే తొలిసారిగా చర్చలు
బుధవారం మధ్యాహ్నం మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ బాలాసాహెబ్ థోరట్, మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్, మరో కాంగ్రెస్ నేత మానిక్రావు ఠాక్రేలు శివసేన చీఫ్ ఉధ్ధవ్ ఠాక్రేతో భేటీ అయ్యారు. అయితే ఈ సమావేశంలో ఎన్సీపీ పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉద్ధవ్ ఠాక్రే తొలిసారిగా కాంగ్రెస్తో అధికారిక చర్చలు జరిపారు. ఇక అంతకుముందు నవంబర్ 11వ తేదీన ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో ఫోన్లో మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటులో తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని ఠాక్రే కోరారు. అయితే తమ నిర్ణయం వెల్లడించేందుకు ఇంకా ఎంత సమయం తీసుకుంటారని కూడా గట్టిగా ప్రశ్నించినట్లు సమాచారం.
కాంగ్రెస్-శివసేనల మధ్య కొన్ని అంశాల్లో విబేధాలు
ఇదిలా ఉంటే ముస్లింలకు ఐదు శాతం రిజర్వేషన్లపై, వీర్సావర్కర్కు భారతరత్న ఇవ్వడంపై శివసేన పార్టీ వైఖరి ఎలా ఉందో స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ చర్చల సందర్భంగా ఠాక్రేను కోరినట్లు తెలుస్తోంది. ఈ రెండు అంశాలపై ఇరు పార్టీల మద్య విబేధాలున్నాయి. మరోవైపు రెండు పార్టీలు పదవుల పంపకాలపై కూడా చర్చించినట్లు సమాచారం. ఎన్సీపీ, శివసేనల కంటే తక్కువ సీట్లు గెల్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటులో మూడు పార్టీలకు సమానంగా పదవుల పంపకాలు ఉండాలనే డిమాండ్ ముందుంచినట్లు సమాచారం. మరోవైపు 2014 పరిస్థితుల్లో బీజేపీకి ఎన్సీపీ బయటనుంచి మద్దతు ఇచ్చిన సంగతి కూడా గుర్తుచేస్తున్నాయి కాంగ్రెస్ శివసేన పార్టీలు. మరోవైపు స్పీకర్ పదవులు పవార్ పార్టీకి ఇచ్చేందుకు రెండు పార్టీలు అంగీకరించడం లేదని సమాచారం.
సరైన సమయంలో సరైన నిర్ణయం వస్తుంది
ఇదిలా ఉంటే కాంగ్రెస్ నేతలతో సమావేశం ముగిశాక మూడు పార్టీల మధ్య సఖ్యత ఉందనే సంకేతాలను శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే పంపారు. చర్చలు సక్సెస్ దిశగా సాగుతున్నాయని సరైన సమయంలో సరైన నిర్ణయంతో బయటకు వస్తామని ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. ఇక తాము మర్యాద పూర్వకంగానే ఉద్ధవ్ ఠాక్రేను కలిశామని చెప్పిన మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ థోరట్... రెండు పార్టీలు కలిసి సమావేశం అయ్యాయి అంటేనే పాజిటివ్ డెవలప్మెంట్స్ చోటుచేసుకుంటున్నట్లుగా పరిగణించాలని చెప్పారు.
కాంగ్రెస్ శివసేన భేటీపై ఎన్సీపీ అసంతృప్తి
అంతకుముందు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కొత్తగా ఎన్నికైన తమ పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతి పాలన అడ్డంకి కాబోదని చెప్పారు. అదే సమయంలో మధ్యంతర ఎన్నికలు కూడా రావని కొత్త ప్రభుత్వం తర్వలోనే పగ్గాలు చేపడుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక సాయంత్రం అజిత్ పవార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్సీపీల మధ్య కుదిరిన కామన్ మినిమమ్ ప్రోగ్రాం శివసేనకు చెబుదామని అనుకున్నామని కానీ సమావేశం చివరినిమిషంలో రద్దు అయ్యిందని వెల్లడించారు. అయితే తిరిగి ఎప్పుడు భేటీ అవుతామనేదానిపై ఇంకా స్పష్టత రాలేదని అజిత్ పవార్ చెప్పారు. ఇదిలా ఉంటే శివసేనతో కాంగ్రెస్ చర్చలు జరపడంపై ఎన్సీపీ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.