Maharashtra Politics:శివసేనకు మద్దతుపై శరద్ పవార్ ఏమన్నారంటే..?
మహారాష్ట్రలో ఒక్కో గంట గడుస్తున్న కొద్దీ అనేక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వ ఏర్పాటు చేయడం లేదంటూ బీజేపీ గవర్నర్కు తెలపగానే ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ శివసేనను ఆహ్వానించారు. దీంతో శివసేన వేగంగా పావులు కదుపుతోంది. ఎన్సీపీతో కలిపి కాంగ్రెస్ మద్దతు తీసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తోంది.
అయితే కాంగ్రెస్ ఎన్సీపీలు తమ డిమాండ్లను శివసేన ముందుంచే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలోనే శివసేన ఎన్డీఏ నుంచి బయటకు వస్తున్నట్లు తెలిపింది. అదేసమయంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తన పార్టీ ఎమ్మెల్యేలలతో సమావేశం అయ్యారు.
మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు వస్తుండటంతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పార్టీ కీలక సమావేశం నిర్వహించారు. శివసేన పార్టీ ఎన్సీపీతో కలిసి కాంగ్రెస్ మద్దతు తీసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
శివసేనకు మద్దతు ఇస్తున్నట్లు వెంటనే రాతపూర్వకంగా లేఖ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్తో చర్చలు జరిపిన తర్వాత సోనియాగాంధీ ఏమి చెబుతారో చూడాల్సి ఉందని శరద్ పవార్ చెప్పారు. ఇదిలా ఉంటే మెజార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం శివసేనకు మద్దతు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 44 సీట్లు సొంతం చేసుకున్న కాంగ్రెస్ నుంచి 85శాతం ఎమ్మెల్యేలు శివసేనకు మద్దతు ఇచ్చేందుకు ఆసక్తి చూపారు. మొత్తం 37 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వ ఏర్పాటులో శివసేనకు సపోర్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇదిలా ఉంటే మహారాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జీగా ఉన్న మాజీ ఎంపీ మల్లిఖార్జున ఖర్గే... జైపూర్లో ఉన్న తమ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మెజార్టీ ఎమ్మెల్యేలు శివసేనతో కలిసి వెళదామనే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నట్లు ఖర్గే చెప్పారు.