Maharashtra polls: ఎమ్మెల్యే అభ్యర్థిపై కాల్పులు, కారులోంచి లాగి చితకబాదారు
నాగపూర్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నప్పటికీ పలుచోట్ల హింసాత్మక ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ ఎమ్మెల్యే అభ్యర్థిపై కొందరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
స్వాభిమాని పక్ష పార్టీకి చెందిన దేవేంద్ర భుయార్ తాజా ఎన్నికల్లో మోర్షి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. సోమవారం తెల్లారుజామున దేవేంద్ర తన కార్యకర్తలతో కలిసి కారులో వెళ్తున్నారు. ఈ సమయంలోనే బైక్పై వచ్చిన ముగ్గురు దుండగులు దేవేంద్ర భుయార్ వాహనంపై కాల్పులు జరిపారు.
ఆ తర్వాత కారును అడ్డగించి, దేవేంద్ర భుయార్ను కారు నుంచి బయటికి లాగి దాడి చేశారు. అంతేగాక, భుయార్ వాహనానికి నిప్పంటించి పరారయ్యారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన భుయార్ను సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు ఆయన అనుచరులు.
ప్రస్తుతం దేవేంద్ర భుయార్ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. మహారాష్ట్రలో సోమవారం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాల వద్దకు చేరారు.
పోలింగ్ చాలా ప్రాంతాల్లో ప్రశాంతంగా జరుగుతున్నప్పటికీ.. కొన్ని చోట్ల ఇలాంటి హింసాత్మక ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. పోలింగ్ నేపథ్యంలో పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తన అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ఆరాటపడుతుంటే.. కాంగ్రెస్ కూడా ఎన్నికల్లో గెలుపు కోసం పోరాటం చేస్తోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీ చేస్తుండగా, కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి పోటీ చేస్తున్నాయి. కాగా, స్వాభిమాని పక్ష పార్టీ కాంగ్రెస్ మిత్రపక్షంగా ఉంది.
మహారాష్ట్రతోపాటు హర్యానాలోనూ సోమవారం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ కూడా బీజేపీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యే ప్రధాన పోటీ ఉంది. అక్టోబర్ 24న ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. తెలంగాణలోని హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంతోపాటు దేశంలోని పలు స్థానాలకు కూడా నేడు ఉపఎన్నికలు జరుగుతున్నాయి.