మహా రాజకీయాల్లో కొత్త ట్విస్ట్: గడ్కరి ఇంటికి అహ్మద్ పటేల్.. శరద్ నివాసానికి సంజయ్ రౌత్..!
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి సుమారు రెండు వారాలు కావస్తోంది. ప్రభుత్వ ఏర్పాటులో నెలకొన్న పీటముడి మాత్రం వీడట్లేదు. పైగా మరింత బిగుసుకుంటోంది. ముఖ్యమంత్రి పీఠాన్ని చెరో రెండున్నరేళ్ల కాలం పాటు పంచుకోవాలంటూ మిత్రపక్షం శివసేన చేసిన ప్రతిపాదనను అంగీకరించడానికి భారతీయ జనతాపార్టీ ససేమిరా అంటోంది. ఫలితంగా తలోదారి చూసుకుంటున్నాయి. 50-50 ఫార్ములా నుంచి శివసేన వెనక్కి తగ్గట్లేదు.. దాన్ని అంగీకరించడానికి బీజేపీ సుముఖంగా లేదు. రోజులు గడుస్తున్నాయి తప్ప ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు అంగుళం కూడా ముందుకు కదలట్లేదు.
రియల్ హీరోలు ఇమ్రాన్ ఖాన్, సిద్ధూ: పంజాబ్ లో వెలిసిన బ్యానర్లు..!
చిక్కుముడి వీడేలా..
ఈ పరిస్థితుల్లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) తాత్కాలిక అధినేత్రి సోనియాగాంధీ ఆంతరింగకుడిగా ముద్ర పడిన అహ్మాద్ పటేల్.. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలుసుకోవడం ఆసక్తి రేపుతోంది. న్యూఢిల్లీలోని గడ్కరీ నివాసానికి వెళ్లి మరీ ఆయనతో భేటీ అయ్యారు అహ్మద్ పటేల్. మరోవంక- శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ ను కలుసుకున్నారు. ఈ రెండు పరిణామాలు మహాారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బాటలు వేయగలవనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
శివసేనకు మద్దతు ఇస్తే..
అసెంబ్లీ ఫలితాలు వెలువడిన తరువాత శరద్ పవార్ ను సంజయ్ రౌత్ కలుసుకోవడం ఇది మూడో సారి. ముఖ్యమంత్రి పదవిని తమకు వదిలి వేస్తే.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్-ఎన్సీపీ కూటమికి మద్దతు ఇస్తామంటూ శివసేన మొదటి నుంచీ చెబుతూ వస్తోంది. శివసేనను తమ కూటమిలో చేర్చుకోవడం వల్ల లౌకికవాద పార్టీ అనే ముద్ర ఎక్కడ చెరిగిపోతుందోనని భయపడుతున్నాయి కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు. ఈ ఉద్దేశంతోనే శివసేనకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని, ప్రతిపక్షంలో కూర్చోవడానికి తమకెలాంటి భేషజాలు లేవని శరద్ పవార్ తేల్చి చెప్పారు. అయినప్పటికీ- శివసేన మాత్రం తమ ప్రయత్నాలు మానుకోలేదు. మరోసారి శరద్ పవార్ తో సంజయ్ రౌత్ సమావేశం అయ్యారు.
శరద్ పవార్ చొరవ తీసుకోవాలంటూ..
శరద్ పవార్ జాతీయ స్థాయి నాయకుడని, అందువల్లే ఆయనను తరచూ కలుసుకుంటున్నానని సంజయ్ రౌత్ వెల్లడించారు. మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిణామాల పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. త్వరలోనే ఈ చిక్కుముడిని వీడేలా తాన చొరవ తీసుకుంటానని శరద్ పవార్ హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. మహారాష్ట్రలో కాబోయే ముఖ్యమంత్రి శివసేన నాయకుడే అవుతాడని, ఇందులో మరో మాటకు అవకాశమే లేదని సంజయ్ రౌత్ తేల్చి చెప్పారు. తాము ప్రతిపాదించిన 50-50 ఫార్ములాకు బీజేపీ అంగీకరిస్తే.. ఇప్పటికిప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు.
ఆసక్తి రేపుతోన్న గడ్కరీ-అహ్మద్ పటేల్ భేటీ..
ఇదిలావుండగా- రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నేపథ్యం గల బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని అహ్మద్ పటేల్ కలుసుకోవడం కనుబొమలెగరేసేలా చేస్తోంది. అహ్మద్ పటేల్ కు గాంధీ కుటుంబానికి అత్యంత ఆప్తుడనే పేరు ఉంది. అలాంటి నాయకుడు ఆర్ఎస్ఎస్ నేపథ్యం గల నాయకుడిని కలుసుకోవడం చర్చనీయాంశమౌతోంది. రైతుల సమస్యలను చర్చించడానికి మాత్రమే తాను గడ్కరిని కలుసుకున్నానని, తమ మధ్య ఎలాంటి రాజకీయ అంశాలు చర్చకు రాలేదని అహ్మద్ పటేల్ స్పష్టం చేస్తున్నప్పటికీ.. నిప్పు లేనిదే పొగ రాదని అంటున్నారు విశ్లేషకులు.