మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన: మనుగడ లేని అసెంబ్లీ, అప్పటి వరకు అంతే..
ముంబై: మహారాష్ట్రలో ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజార్టీ రాకపోవడం, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా పార్టీలు ముందుకు రాకపోవడంతో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మహారాష్ట్రలో రాష్ట్రపతి పరిపాలనకు ఆమోదం తెలిపారు. కేంద్ర కేబినెట్ ఈ మేరకు రాష్ట్రపతి వద్దకు తీసుకెళ్లగా ఆయన ఆమోద ముద్ర వేశారు.
మహారాష్ట్ర రాజకీయాల్లో మలుపులు, ప్రభుత్వ ఏర్పాటు కోసం ఎన్సీపీకి గవర్నర్ ఆహ్వానం
ఆరు నెలలపాటు..
మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి సిఫార్సుల మేరకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని నిర్ణయించారు. కాగా, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం ప్రకారం.. మహారాష్ట్రలో ఆరు నెలలపాటు రాష్ట్రపతి పాలన కొనసాగనుంది.
అప్పటి వరకు అంతే..
ఏదైనా పార్టీ అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకుంటే మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అప్పుడు రాష్ట్రపతి పాలనను ఎత్తివేయడం జరుగుతుంది. ఈ సమయంలో మహారాష్ట్రలో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదని గవర్నర్ వివరించారని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.
మనుగడ కోల్పోయిన అసెంబ్లీ..
గవర్నర్ నివేదికపై కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసిందని, ఆ తర్వాత మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారని వెల్లడించారు. రాష్ట్రపతి పాలనతో మహారాష్ట్ర అసెంబ్లీకి మనుగడ ఉండదని స్పష్టం చేశారు.
నిన్న శివసేన.. నేడు ఎన్సీపీ..
శివసేన తర్వాత అతిపెద్ద పార్టీగా ఉన్న ఎన్సీపీని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సింది సోమవారం గవర్నర్ భగత్ సింగ్ కోరిన విషయం తెలిసిందే. ఎన్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పినప్పటికీ.. ఆ పార్టీకి 54 సీట్లే ఉండటం గమనార్హం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 145 ఎమ్మెల్యే స్థానాలను కలిగివుండాలి.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేకపోవడంతో..
అంతకుముందు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని శివసేన చెప్పింది. అయితే ఆ పార్టీకి కేవలం 56 ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని ప్రయత్నించినా.. విజయవంతం కాలేకపోయారు శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే. 105 ఎమ్మెల్యే స్థానాలున్న బీజేపీ కూడా తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని, మిత్రపక్షమైన శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సహకరించడం లేదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పాలనే శరణ్యమైంది.