భారీ వర్షాలతో మహారాష్ట్రలో అల్లకల్లోలం-136కి చేరిన మృతుల సంఖ్య-రాబోయే 48గం. కీలకం...
భారీ వర్షాలు మహారాష్ట్రను అతలాకుతలం చేస్తున్నాయి. ముంబై సహా పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వరదల్లో కొట్టుకుపోయిన ఘటనలు,కొండ చరియలు విరిగిపడిన ఘటనల్లో ఇప్పటివరకూ 136 మంది మృతి చెందారు. ఇందులో ఒక్క రాయ్గఢ్ ఘటనలోనే 47 మంది వరకు మృతి చెందారు.
మహారాష్ట్రలోని రాయ్గఢ్,రత్నగిరి,పాల్ఘర్,థానే,నాగ్పూర్,కొల్హాపూర్ జిల్లాలు ఇప్పటికీ జలదిగ్భంధంలోనే ఉన్నాయి. రాగల 24 గంటల్లో రాయ్గఢ్,రత్నగిరి,సింధుదుర్గ్,పుణే,సతారా,కొల్హారా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రత్నగిరి,సతారా జిల్లాలకు శనివారానికి (జులై 24) రెడ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే ముంబై,కొంకణ్ తీర ప్రాంతాలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. సెంట్రల్ మహారాష్ట్రతో పాటు,కొంకణ్,గోవా ప్రాంతాల్లో రాబోయే 2 రోజులు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
ప్రస్తుతం మహారాష్ట్రలో 18 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. అదనంగా మరో 8 బృందాలు శనివారం(జులై 24) నుంచి సహాయక చర్యల్లో పాల్గొననున్నాయి.రాయ్గఢ్లో కొండ చరియలు విరిగిపడిన ఘటనలు ప్రస్తుతం సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. దాదాపు 80-85 మంది మిస్సయినట్లు చెబుతున్నారు. ఇప్పటికీ చాలామంది శిథిలాల కిందే ఉన్నారని చెబుతున్నారు. వారిని బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
కొల్హాపూర్ జిల్లాలో భారీ వరదలకు చాలా ప్రాంతాలు మునిగిపోయాయి. దీంతో 40వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 84,452 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో వరదల కారణంగా 54 గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. మరో 821 గ్రామాలు పాక్షికంగా నీట మునిగాయి.
రాష్ట్రంలో గడిచిన 48 గంటల్లో కొండ చరియలు విరిగినపడిన ఘటనలు దాదాపు 10,12 చోటు చేసుకున్నాయని అన్నారు. కొండ ప్రాంతాల్లోకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకోవడంలో సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో రాబోయే 48 గంటలు చాలా కీలకమని చెప్పారు.
Recommended Video
రాయ్గఢ్ మృతుల కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ రూ.2లక్షలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. గాయపడినవారికి రూ.50వేలు ఆర్థిక సాయం ప్రకటించారు. మరోవైపు,మహారాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు ఆర్థిక సాయం ప్రకటించింది.