మహారాష్ట్ర సర్కార్ సంచలనం -రిహాన్నా ట్వీట్లకు కౌంటర్ వ్యవహారం- సెలబ్రిటీలపై దర్యాప్తు
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఢిల్లీలో రైతులు చేపడుతున్న నిరసనలపై మోడీ సర్కార్ అనుసరిస్తున్న వైఖరిపై అంతర్జాతీయంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. భారత్ అంతర్గ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని విదేశాంగశాఖ కోరుతున్నా అంతర్జాతీంగా పలువురు సెలబ్రిటీలు, సంస్ధలు, రాజకీయ పార్టీలు తమ నిరసన గళం వినిపిస్తున్నాయి. దీంతో వీరికి కౌంటర్గా భారతీయ సెలబ్రిటీలతో కేంద్రం కౌంటర్లు ఇప్పిస్తోంది. ఇప్పుడు ఈ వ్యవహారంపై మహారాష్ట్ర సర్కారు చర్యలకు సిద్దమవుతోంది.
మహరాష్ట్రలో ఉంటున్న క్రీడా, సినిమా రంగాలకు చెందిన సెలబ్రిటీలు సచిన్, అక్షయ్ కుమార్, కంగనా రనౌత్ వంటి వారు రైతు నిరసనలపై స్పందిస్తున్న అంతర్జాతీయ సెలబ్రిటీలకు విమర్శలకు దిగుతున్నారు. వీరి వెనుక కేంద్ర ప్రభుత్వం ఉందని ఆరోపిస్తున్న మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోవాలని అక్కడి మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కోరింది. దీంతో ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపిస్తామని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ వారికి హామీ ఇచ్చారు.
సోషల్ మీడియాలో అంతర్జాతీయ సెలబ్రిటీలకు వ్యతిరేకంగా దేశీయ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు చేస్తున్న ట్వీట్ల వెనుక కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీల ప్రోత్సాహం ఉందన్న ఆరోపణలపై మహారాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తుకు సిద్ధం కావడం సంచలనం రేపుతోంది. పాప్ స్టార్ రిహాన్నా ట్వీట్, సామాజిక కార్యకర్త గ్రెటా ధన్బర్గ్ ట్వీట్లపై స్పందిస్తూ సోషల్ మీడియాలో భారీ ఎత్తున వారికి వ్యతిరేకంగా దేశీయంగా సెలబ్రిటీలు, వివిధ పార్టీల నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అవుతోంది.