బీజేపీ 164, శివసేన 124 స్థానాల్లో పోటీ, ఎట్టకేలకు మరోసారి పొడిసిన పొత్తు
మహారాష్ట్రలో అధికార బీజేపీ-శివసేన సీట్ల కేటాయింపు ఎట్టకేలకు కొలిక్కివచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. 288 సీట్లు గల మహారాష్ట్ర అసెంబ్లీకి బీజేపీ-శివసేన పోటీచేసే స్థానాలపై క్లారిటీ వచ్చింది. ఈ మేరకు బీజేపీ-శివసేన తమ సీట్ల కేటాయింపుపై మీడియాకు తెలిపాయి.
మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అధిక స్థానాల్లో పోటీ చేయాలని బీజేపీ-శివసేన భావించడంతో సీట్ల కేటాయింపుపై పీఠముడి నెలకొంది. చివరకు బీజేపీ 164 చోట్ల పోటీ చేసేందుకు శివసేన అంగీకరిచింది. శివసేనకు 124 సీట్లను బీజేపీ ఇవ్వడంతో సీట్ల కేటాయింపుపై నెలకొన్న ఉత్కంఠ వీడింది. ఈ సీట్ల కేటాయింపుపై ఇరుపార్టీలు అంగీకరించడంతో మరోసారి పొత్తు పొడిచింది. బీజేపీ 164, శివసేన 124 కలిపి 288 చోట్ల పోటీ చేయడంతో మరి ఆర్పీఐ ఇతర పార్టీలకు స్థానాలు లేకుండా పోయాయి. అయితే ఇప్పటికే ఆర్పీఐ ఆరుగురు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. వారు ఎన్డీఏ కూటమి నుంచి బరిలోకి దిగే అవకాశం లేదు.
వాస్తవానికి సీట్ల కేటాయింపు ఇదివరకే చేపట్టాల్సి ఉంది. కానీ బీజేపీ-శివసేన పోటీ చేసే స్థానాలపై క్లారిటీ రాకపోవడంతో ఇన్నాళ్లు ఆగిపోయారు. తొలుత బీజేపీ 144, శివసేన 126 పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపించాయి. మిగిలిన 18 స్థానాలకు తమ భాగస్వామ్యపక్షాలకు కేటాయిస్తామని సంకేతాలు ఇచ్చారు. కానీ చివరికి ఆర్పీఐ ఇతర పక్షాలకు ఎన్డీఏ సీట్లు కేటాయించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే ప్రస్తుత సీఎం ఫడ్నవీస్ తిరిగి పగ్గాలు చేపడుతారు. డిప్యూటీ సీఎం పదవీ మాత్రం శివసేనకు అప్పగిస్తామని బీజేపీ-శివసేన మధ్య ఒప్పందం జరిగింది.