షాకింగ్ : మహారాష్ట్రలో ఒక్కరోజే వెయ్యి దాటిన కేసులు.. ఇప్పటివరకూ ఇదే అత్యధికం
మహారాష్ట్రలో శుక్రవారం(మే 1) కొత్తగా మరో 1,008 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే కావడం గమనార్హం. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 11,506కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 26 మంది మృతి చెందారు. ముంబైలో 5,జల్గావ్లో 3,పుణే,సింధుదుర్గ్,థానే,భీవండి,నాందేడ్,ఔరంగాబాద్,పర్బని జిల్లాల్లో ఒక్కో మరణం సంభవించాయి. 26 మంది మృతుల్లో 15 మంది మృతులు అప్పటికే వేరే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
మృతుల్లో ఉత్తరప్రదేశ్కి చెందిన ఓ వ్యక్తి కూడా ఉన్నట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక ఇప్పటివరకూ కరోనా ఫ్రీగా అమరావతి జిల్లాలోనూ మొదటి పాజిటివ్ కేసు నమోదైంది. 50 ఏళ్ల ఓ గృహిణికి కరోనా సోకినట్టు గుర్తించారు. ప్రస్తుతం నాగ్పూర్లోని ఓ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు.
అంతకుముందు,మూడు రోజుల క్రితం ఆమె దగ్గు,జ్వరం లక్షణాలతో అమరావతి జిల్లాలోని వరుద్ పట్టణంలో ఉన్న ఓ ఆసుపత్రిలో చేరింది. అక్కడినుంచి మెరుగైన చికిత్స కోసం నాగ్పూర్కి తరలించగా.. మెడికల్ రిపోర్టుల్లో ఆమెకు కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది.
ఇక దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసుల సంఖ్య 37,257కి చేరుకోగా.. ఒక్క మహారాష్ట్రలోనే 11,506 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ 485 మంది మృతి చెందారు. 1879 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ను మరో 14 రోజుల పాటు పొడగించిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి జోన్ల వారీగా పలు సడలింపులు ఇచ్చింది. వలస కార్మికుల తరలింపు కోసం ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది.