మేడపైనే విమానం తయారుచేశాడు.. రూ.35 వేల కోట్ల డీల్ కొట్టేశాడు!
ముంబై: తన ఇంటి మేడపై ఓ చిన్న విమానాన్ని తయారు చేసిన ఓ పైలట్కు ఏకంగా విమానాలు తయారు చేసే అవకాశం ప్రభుత్వం నుంచి లభించింది. అది కూడా ఒకటి, రెండు కాదు.. ఏకంగా రూ.35 వేల కోట్ల ప్రాజెక్టు దక్కింది.
వివరాల్లోకి వెళితే... కెప్టెన్ అమోల్ యాదవ్ ముంబయిలోని కండివాలి సబర్బ్లోని తన ఇంటి మేడపై ఆరేళ్లపాటు శ్రమించి ఆరుగురు కుర్చునే వీలున్న విమానం తయారు చేశారు. ముంబయిలో జరిగిన 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమంలో ఆ విమానాన్ని ప్రదర్శనకు ఉంచారు.
ఈ విమానాన్ని చూసిన పౌర విమానాయాన శాఖ మంత్రి పి.అశోక గజపతి రాజు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్లు అమోల్ యాదవ్ పనితనానికి ముగ్ధులయ్యారు. వెంటనే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు ప్రతిపాదించి కేవలం 90 రోజుల్లోనే రిజిస్టర్ చేయించారు.
కెప్టెన్ అమోల్ యాదవ్ తన తొలి విమానం తయారీని 2011 లో మొదలుపెట్టి 2016 నాటికి పూర్తి చేశారు. 2017లో ఈ విమానానికి ఏరియల్ టెస్టులు నిర్వహించేందుకు డీజీసీఎ నుంచి అనుమతి లభించింది. విమానం విజయవంతంగా ఎగరడంతో ఆయనతో భారీ ప్రాజెక్టు చేపట్టేందుకు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
సోమవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో అమోల్ యాదవ్కు చెందిన థ్రస్ట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్తో ప్రభుత్వం రూ.35వేల కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ ప్రకారం అమోల్ యాదవ్కు పాల్ఘార్లోని 155 ఎకరాలు కేటాయించనున్నారు. 'మేక్ ఇన్ ఇండియా' కింద ఈయన కంపెనీ చిన్న విమానాలను తయారు చేసి అందివ్వాల్సి ఉంటుంది.