పట్టాలు తప్పిన హౌరా మెయిల్ మూడు బోగీలు: అప్రమత్తతో తప్పిన ప్రమాదం
నాసిక్: ఆదివారం తెల్లవారుజామున ముంబై-హౌరా మధ్య ప్రయాణించే రైలు పట్టాలు తప్పింది. మహారాష్ట్రలోని నాసిక్ వద్ద రైలులోని మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టం గురించి ఎలాంటి సమాచారం అందలేదు.
ముంబై నుంచి హౌరాకు(12809) నాగ్పూర్ మీదుగా వెళ్లే ఈ రైలు బయల్దేరిన కొద్దిసేపటికే ఇగత్పురి వద్దకు రాగానే ఎస్-12,ఎస్-13, ప్యాంట్రీ కార్ బోగీలు పట్టాలు తప్పాయని రైల్వే అధికారులు తెలిపారు. భారీ వర్షం కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందనుకుంటున్నామని చెప్పారు.
వెంటనే అప్రమత్తం అవ్వడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. మరమ్మతు చర్యలు ప్రారంభించామని, ఈ ఘటలో ఇప్పటివరకూ ఎవరికీ ప్రాణహాని జరగలేదని చెప్పారు.
ఘటనపై మరిన్ని వివరాలు తర్వాత వెల్లడిస్తామ అని రైల్వే అధికారి తెలిపారు. కాగా, ఈ ఘటన కారణంగా ఆ మార్గంలో ప్రయాణించే 12 రైళ్లు ఆలస్యంగా నడిచాయి. మరికొన్నింటిని దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు.