35 అడుగుల ఎత్తు నుంచి దూకి..బండరాళ్ల మధ్య చిక్కుకుని.. పెద్ద పులి మృత్యువాత
ముంబై: మహారాష్ట్రలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. 35 అడుగుల ఎత్తు ఉన్న వంతెన మీది నుంచి నదిలోకి దూకిన ఓ పెద్ద పులి మృత్యువాత పడింది. అంత ఎత్తు నుంచి నదిలో దూకే సమయంలో దురదృష్టవశావత్తు అది బండరాళ్ల మీద పడింది. వాటి మధ్య ఇరుక్కునిపోయింది. బయటికి రాలేక..మరణించింది. మహారాష్ట్ర విదర్భ ప్రాంతంలోని చంద్రాపూర్ జిల్లా కునాడ గ్రామ సమీపంలో గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.
మూడేళ్ల కుమారుడి నాలుకను తెగ్గోసి..కాలువలో విసిరేసి..!
మహారాష్ట్రలోనే అతి పెద్దదైన టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ తడోబా-అంధారి పరిధికి ఆనుకుని ఉంటుంది ఈ గ్రామం. టైగర్ రిజర్వ్ ప్రాంతం నుంచి తరచూ గ్రామాల వైపునకు వస్తుంటాయి పెద్ద పులులు. బుధవారం సాయంత్రం ఓ పెద్ద పులి కునాడ గ్రామ సమీపానికి వచ్చింది. దీన్ని చూసిన గ్రామస్తులు దాన్ని అదిలించడానికి పెద్ద ఎత్తున శబ్దాలు చేశారు. దీనితో బెదిరిపోయిన పెద్ద పులి గ్రామ శివార్లలో సిర్నా నదిపై నిర్మించిన వంతెన మీది నుంచి నదిలోకి దూకింది.
దూకే సమయంలో దురదృష్టవశావత్తు అది బండరాళ్ల మధ్యన పడింది. అక్కడే చిక్కుకునిపోయింది. బయటికి రాలేక విలవిల్లాడింది. దీన్ని గమనించిన వెంటనే స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు పులిని బయటికి తీయడానికి ప్రయత్నించారు. అవి విఫలం అయ్యాయి. బండరాళ్ల మధ్యన పడటంతో వెన్నుకు గాయాలు కావడంతో మరణించినట్లు వారు తెలిపారు.