ఏపీ తరువాత: ముస్లింలకు మహారాష్ట్ర సర్కార్ తీపి కబురు: అయిదు శాతం రిజర్వేషన్.. !
ముంబై: మహారాష్ట్రలోని ఉద్ధవ్ థాకరే సర్కార్.. ముస్లింలకు తీపి కబుురు అందించింది. తమ రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థల్లో ముస్లిం యువతకు అయిదు శాతం రిజర్వేషన్ను కల్పించబోతున్నట్లు వెల్లడించింది. దీనిపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నామని మహారాష్ట్ర మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి నవాబ్ మలిక్ వెల్లడించారు.
Recommended Video
శుక్రవారం ఆయన ముంబైలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ ప్రకటన చేశారు. నిజానికి- ముస్లింలకు రిజర్వేషన్లను కల్పిస్తామని ఇదివరకు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రకటించిందని, అనంతరం మొండిచెయ్యి చూపిందని విమర్శించారు. ఆ హామీని తమ సంకీర్ణ ప్రభుత్వం నెరవేర్చబోతోందని అన్నారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు నవాబ్ మలిక్ సమాధానం ఇచ్చారు.
ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు. విద్యారంగంలో ముస్లింలు వెనుకంజలో ఉన్నారని, మిగిలిన వారితో సమానంగా వారు పోటీ పడేలా చేస్తామని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడే తాము ప్రవేశపెట్టబోయే రిజర్వేషన్లు ఉంటాయని చెప్పారు. ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది ముస్లిం విద్యార్థులకు ఉన్నత చదువులకు అభ్యసించడానికి వీలు కలుగుతుందని అన్నారు.