ఉపాధ్యాయురాలికి కారును బహుమతిగా ఇచ్చిన పేరెంట్స్: ఎందుకంటే?
Recommended Video
ముంబై: మహారాష్ట్రలో ఓ ఉపాధ్యాయురాలికి విద్యార్థుల తల్లిదండ్రులు ఓ కారును బహుమతిగా ఇచ్చారు. మహారాష్ట్రలోని షిరూర్ తాలుకా పింపుల్ ఖల్సా గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇక్కడి జిల్లా పరిషత్ స్కూల్కు చుట్టుపక్కల గ్రామాల పిల్లలు చదువుకుంటారు. ఇప్పుడు అక్కడ 350 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ లలితా దుమాల్ అనే ఉపాధ్యాయురాలు చాలా రోజులుగా పని చేస్తున్నారు.
ప్రతి ఏటా అయిదో తరగతి చదివే పిల్లలు ఉపకారవేతనంతో కూడిన విద్యాఫలాలను అందుకునేలా కొన్ని పరీక్షలు ఉంటాయి. ఇందుకోసం విద్యార్థులకు ఆమె మంచి శిక్షణ ఇచ్చారు. ఓసారి ఐదో తరగతిలో 19మంది ఉంటే అందరికి స్కాలర్షిప్స్ వచ్చాయి.
గత సంవత్సరం 21 మందికి వచ్చింది. లలిత దూర ప్రాంతం నుంచి స్కూల్కు వచ్చినా సరే పిల్లల కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఆమె సాయంత్రం ఆరు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు స్కూల్లోనే ఉండి, పిల్లలకు ప్రత్యేక క్లాస్లు తీసుకుంటారు. సెలవు రోజుల్లోనూ ఈ పరీక్ష కోసం వారిని చదివిస్తారు. ఆమె ఎక్కువగా సెలవులు తీసుకోరు.
గత నెల పదిన ఉపకారవేతనం అందుకునే పరీక్షా ఫలితాలు వచ్చాయి. ఆ ఫలితాల వల్ల చాలామంది తల్లిదండ్రులకు పిల్లల చదువుల భారం తప్పింది. అందుకు అభినందనగానే ఆ పిల్లలు, వారి తల్లిదండ్రులు ఆమెకి కారును బహుమతిగా ఇచ్చారు. పైగా ఆ కారు ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నా ఆమె బడికి వస్తారని అంటున్నారు. ఆమె మరింత మందికి సాయం చేసేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
ఇక్కడి విద్యార్థుల తల్లిదండ్రుల్లో లలిత విధుల్లో చేరిన తర్వాతే చాలా మార్పు వచ్చింది. అంతకుముందు, విరాళాలు సేకరించి వారే పాఠశాలను బాగు చేయించారు. ఇప్పుడు ఆమెకు కారు బహుమతిగా ఇచ్చారు. గతంలోని టీచర్లకు ఫ్రిజ్లు, బైక్లు కూడా బహుమతిగా ఇచ్చారు.
దీనిపై టీచర్ లలితా దుమాల్ మాట్లాడుతూ.. నేను ఇక్కడ గత కొన్నేళ్లుగా పని చేస్తున్నానని చెప్పారు. గతంలోని టీచర్లకు ఇక్కడి వారు బైకులు, ఫ్రిడ్జ్లతో పాటు ఇతర వస్తువులు ఇచ్చారని తెలిపారు. కానీ గత నాలుగేళ్లుగా వీరు కార్లు ఇస్తున్నారని చెప్పారు.