చీలనున్న 'మరాఠా', మహారాష్ట్రలో మజ్లిస్ ప్రభావం
ముంబై: ఈసారి మహారాష్ట్ర ఎన్నికల్లో పలు స్థానాల్లో మజ్లిస్ పార్టీ కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మజ్లిస్ పార్టీ మొన్నటి వరకు హైదరాబాదుకే పరిమితమైన పార్టీ. ఆ పార్టీ క్రమంగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా ఈసారి మహా ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ముప్పైకి పైగా స్థానాలలో పోటీ చేస్తున్న మజ్లిస్ పార్టీ మైనార్టీల ఓట్లను చీల్చనుంది.
ఎన్నో ఏళ్ల నుండి మహారాష్ట్ర రాజకీయాలను ఎంతగానో ప్రభావితం చేసిన మరాఠా సామాజిక వర్గం ఈ ఎన్నికల్లో బహుశా తన ప్రాముఖ్యతను కోల్పోయో పరిస్థితి ఏర్పడినట్లుగా పరిశీలకులు భావిస్తున్నారు. రాష్ట్ర జనాభాలో సుమారు 30 శాతంగా ఉన్న మరాఠావారి ఓట్లు ఉన్నాయి. ఈ దఫా కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనల మధ్య బాగా చీలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దాదాపు అన్ని పార్టీల నుంచి మరాఠా ఎమ్మెల్యేలు ఉన్నారు. కొద్దిమంది శివసేన నుండి కూడా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ప్రధానంగా మరాఠా, దళిత, గిరిజన, మైనార్టీ ఓట్లను కలుపుకొని 1999 నుండి కాంగ్రెస్, ఎన్సీపీలు వరుసగా విజయం సాధిస్తూ వచ్చాయి.
ఈ సారి కాంగ్రెస్, ఎన్సీపీలు చీలిపోయాయి, అదేవిధంగా బీజేపీ, శివసేనలు వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. పైగా 13 శాతంగా ఉన్న మైనార్టీలు ఈ దఫా ఎన్సీపీ కంటే కాంగ్రెస్ పార్టీనే ఎక్కువగా కోరుకుంటున్నారు. మజ్లిస్ పోటీ చేసే స్థానాల్లో ఈ పార్టీ భారీగా ఓట్లను చీల్చనుంది.
మరో విషయమేమంటే దళిత, గిరిజన సామాజిక వర్గానికి చెందిన వారు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రముఖ దళిత నేత రామ్ దాస్ అథవాలే ప్రస్తుతం బీజేపీ పక్షాన ఉండటమే దీనికి కారణం. అేతంకాకుండా మోడీ ప్రభుత్వంలో ఒక మంత్రి పదవి ఇప్పిస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఇప్పటికే అథావలేకు హామీ ఇచ్చారు. దీంతో దళిత, గిరిజన ఓట్లు ఎక్కువగా బీజేపీకి పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సుమారు వంద స్థానాల్లో దళితుల ఓట్లు కీలకంగా మారుతాయి. ఈ కారణంగానే ప్రీ పోల్ సర్వేలు బీజేపీయే ఎక్కువ స్థానాల్లో గెలుపొందుతుందని చెబుతున్నాయి. కాంగ్రెస్, ఎన్సీపీలకు చెందిన ముఖ్యనేతలు కొందరు బీజేపీ వైపుకు వెళ్తున్నారు. ఇది కూడా బీజేపీకి కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎన్సీపీకి చెందిన ప్రముఖ దళిత నేత విజయ్ గవిట్ ఆ పార్టీ నుండి బయటకు వచ్చి బీజేపీ టిక్కెట్ పైన పోటీ చేస్తున్నారు. గిరిజన ముఖ్యనేత బామురావు మాధవి కుమారుడు దినేష్ మాధవి కూడా బీజేపీ తరఫున ప్రచారం చేస్తున్నారు. వీరే కాక చాలామంది బీజేపీకి మద్దతు పలుకుతున్నారని సర్వేల ద్వారా తెలుస్తోంది.