
మహా రాజకీయంలో మరో ట్విస్ట్- రెబెల్స్ తో ఏక్ నాథ్ షిండే కొత్త పార్టీ-పేరు శివసేన(బాలాసాహెబ్)
మహారాష్ట్రలో శివసేన పార్టీలో తలెత్తిన తిరుగుబాటు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ నేపథ్యంలో రెబెల్ ఎమ్మెల్యేలను ఎక్కువ రోజులు క్యాంపులో ఉంచడం సాధ్యం కాదని భావిస్తున్న వారి నేత ఏక్ నాథ్ షిండే ముంబయికి తిరిగి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అంతే కాదు రెబెల్స్ తో కలిసి కొత్త పార్టీ ఏర్పాటుకు సిద్దమవుతున్నారు.
ప్రస్తుతం అస్సోంలోని గౌహతిలో ఉన్న ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని రెబెల్ ఎమ్మెల్యేలు త్వరలో ముంబైకి తిరిగి రానున్నారు. అదే సమయంలో ముంబైలో అడుగుపెట్టాక కొత్త పార్టీ ప్రకటించేందుకు కూడా సిద్ధమవుతున్నారు. శివసేన(బాలాసాహెబ్) పేరుతో కొత్త పార్టీ పెట్టాలని వారు భావిస్తున్నారు. ఈ విషయాన్ని రెబెల్ క్యాంపులో ఎమ్మెల్యే దీపక్ కేసర్కార్ ప్రకటించారు. దీంతో ఏక్ నాథ్ షిండే కొత్త పార్టీ ఆసక్తి రేపుతోంది.

ఇప్పటికే శివసేన సిద్ధాంతాలతో కానీ, బాల్ థాక్రే భావజాలంతో కానీ తాము వేరు కాలేదని చెప్తున్న ఏక్ నాథ్ షిండే వర్గం తమదే అసలైన శివసేనగా ప్రకటించుకుంటుందని అంతా భావించారు. కానీ దానికి బదులుగా కొత్త పార్టీ ఏర్పాటుకు వారు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మహావికాస్ అఘాడీ సర్కార్ లో భాగస్వాములుగా ఉన్న ఎన్సీపీ, కాంగ్రెస్ తో వేరుపడేందుకు ఉద్ధవ్ థాక్రే సిద్ధం కాకపోవడంతో తామే వేరే పార్టీ పెట్టుకుని బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని రెబెల్ ఎమ్మెల్యేల నేత ఏక్ నాథ్ షిండే సిద్దమవుతున్నారు.