మహాత్మా గాంధీ మనుమడు కానూభాయ్ కన్నుమూత
సూరత్: జాతిపిత మహాత్మా గాంధీ మనుమడు కానూభాయ్ గాంధీ(87) సూరత్లో సోమవారం కన్నుమూశారు. గాంధీజీ మూడో కుమారుడు రాందాస్ గాంధీ పుత్రుడైన కానూభాయ్ తన భార్య శివలక్ష్మితో కలిసి పంజాబీ సమాజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని ఇక్కడి రాధాకృష్ణ ఆలయ ఆశ్రమంలో ఉంటుండేవారు.
ఆయనకు అక్టోబర్ 22న గుండెపోటు రావడంతో సూరత్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. కానూభాయ్ మృతికి ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
కాగా, నాసాశాస్త్రవేత్తగా, అమెరికా రక్షణ శాఖ ఉద్యోగిగా సేవలందించిన ఆయన మెడికల్ రీసెర్చర్ అయిన శివలక్ష్మి(90)ని వివాహం చేసుకున్నారు. ఉప్పు సత్యాగ్రహానికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన ఆయనకు భార్య తప్ప నా అనే వారు ఎవరూ లేరు. 40 ఏళ్లపాటు అమెరికాలో ఉన్న కానూ దంపతులు రెండేళ్ల క్రితం భారత్కు తిరిగి వచ్చారు. వీరికి సంతానం లేదు.
ఉద్యోగం ద్వారా సంపాదించినది దానధర్మాలకు ఖర్చు చేయడంతో చేతిలో చిల్లిగవ్వలేని దీనస్థితికి చేరుకున్నారు. ఈక్రమంలో అనారోగ్యం పాలైన ఆయన ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలోని ఆస్పత్రిలో చికిత్స పొందారు. అక్టోబరు 22న వచ్చిన గుండె పోటు కారణంగా కానూ పక్షవాతానికి గురయ్యారు. ఫలితంగా ఎడమవైపు శరీర భాగం చచ్చుబడిపోయింది. వెంటిలేటర్పై ఉన్న ఆయన పరిస్థితి మరింత విషమించడంతో కన్నుమూశారు.