గాంధీజీ కిల్లర్స్ బతికే ఉన్నారు, సిగ్గుపడ్తున్నా: లాలూ
పాట్నా: జాతిపిత మహాత్మా గాంధీని చంపిన వారు ఇప్పటికీ జీవించి ఉన్నారని రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) చీఫ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ శుక్రవారం నాడు అన్నారు. ఆయన రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ను ఉద్దేశిచి పై వ్యాఖ్యలు చేశారు.
'బాపూ, (మహాత్మా గాంధీజీ) మిమ్మల్ని చంపిన వారు ఇప్పటికీ బతికున్నారు. అందుకు మేం సిగ్గుపడుతున్నాం' అని లాలూ ప్రసాద్ వ్యాఖ్యానించారు. మహాత్ముడి 146వ జయంతి సందర్భంగా లాలూ ప్రసాద్ యాదవ్ గాంధీజీకి నివాళులు అర్పించారు.
గాంధీజీని చంపిన వారిని ఇంకా ఎవరు పూజిస్తున్నారని మీడియా లాలూ ప్రసాద్ యాదవ్ను అడిగింది. దానికి ఆయన... ఆరెస్సెస్ అంటూ సమాధానం ఇచ్చారు.
బిహార్ ఎన్నికలు మోడీకి పరీక్షే
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ప్రధాని నరేంద్ర మోడీకి అతిపెద్ద పరీక్ష అని అమెరికాలోని మేథోవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
బీహార్ ఓటర్ల నిర్ణయం ఎలా ఉన్నప్పటికీ దాని ప్రకంపనలు మాత్రం సరిహద్దులు దాటి చాలాదూరం దాకా ఉంటాయని అమెరికాలోని ప్రముఖ మేధావుల వేదిక అయిన ‘కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్'కు చెందిన మేధావులు మిలన్ వైష్ణవ్, సాక్షమ్ ఖోస్లా బుధవారం ఒక బహిరంగ సంపాదకీయంలో అభిప్రాయపడ్డారు. అందువల్ల అక్టోబర్ 12న మొదలై నవంబర్ 8న ముగిసే బిహార్ ఎన్నికలు ప్రధాని మోడీ ప్రభుత్వానికి అతిపెద్ద పరీక్ష అని వారు అభిప్రాయపడ్డారు.