జామియా కాల్పులు బీజేపీ కుట్ర.. ఢిల్లీ ఎన్నికల్లో లబ్ధి కోసమేనన్న కాంగ్రెస్
దేశవ్యాప్తంగా కలకలం రేపిన జామియా కాల్పుల ఘటనపై ప్రతిపక్ష పార్టీలన్నీ బీజేపీ సర్కారును టార్గెట్ చేశాయి. విద్వేషం, కుట్రలతో ఢిల్లీ ఓటర్లను ప్రభావితం చేసిన అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఆ పార్టీ ఎంపీ, అధికార ప్రతినిధి మనీశ్ తివారీ గురువారం ఏఐసీసీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. జామియా కాల్పుల ఘటనలపై కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ కూడా స్పందించారు.
గాంధీ బతికుంటే..
గాడ్సేలోని విద్వేషం ఇప్పటికీ పొగలు కక్కుతున్నదని, మహాత్మా గాంధీ గనుక బతికుంటే.. దేశంలో నెలకొన్న పరిస్థితులు చూసి కన్నీరుపెట్టేవారని, కొద్దిరోజులుగా బీజేపీ నేతలు చేస్తున్న విద్వేషపూరిత వ్యాఖ్యల ప్రభావానికి లోనయ్యే నిందితుడు దారుణానికి పాల్పడ్డాడని మనీశ్ తివారీ పేర్కొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే ప్లాన్ ప్రకారం జామియా కాల్పులు జరిగాయని ఆయన ఆరోపించారు.
ప్రియాంక ఫైర్
‘‘వ్యతిరేకుల్ని కాల్చిపారేయండంటూ బీజేపీ మంత్రులు, నేతలు బహిరంగంగా ప్రకటలు చేస్తున్నవేళ జామియాలాంటి ఉదంతాలకు చాలా అవకాశముంది. ఢిల్లీని ఇలానే తయారుచేయాలని ప్రధాని మోదీ భావిస్తున్నారా? హింసను సమర్థిస్తున్నారో, అహింసను సమర్థిస్తున్నారో చెప్పే ధైర్యం వీళ్లకుందా? ఢిల్లీని అభివృద్ధి చేస్తారా.. లేక ఇలాగే ప్రజల్ని గందరగోళంలో నిలబడతారా?''అని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా ప్రశ్నించారు.
కలకలం..
యూపీకి చెందిన గోపాల్ వర్మ అనే టీనేజర్.. గురువారం మధ్యాహ్నం ఢిల్లీలోని జామియా మిలియా వర్సిటీ గేటు దగ్గర సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తోన్న విద్యార్థులపై కాల్పు జరిపాడు. ఈ ఘటనలో ఓ విద్యార్థి గాయపడ్డాడు. గోపాల్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. వందలమంది పోలీసులు, మీడియా కెమెరాల ముందే దుండగులు ఈ దుశ్చర్యకుదిగడం గమనార్హం.