మహాత్మాగాంధీ జాతి పిత కాదు.. జాతి పుత్రరత్నం... బీజేపీ ఎంపీ సాద్వీ ప్రజ్ఞా
బీజేపీ ఎంపీ సాద్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సారి జాతి పిత మహాత్మాగాంధీ అంశానికి సంబంధించి కాంట్రవర్సీ కామెంట్ చేశారు. గాంధీ జాతి పిత కాదట.. జాతి కుమారుడు అని హితోపదేశం చేశారు. సాద్వీ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
గాంధీ జయంతి: ఏం మారింది మహాత్మా!
సాద్వీ నోటిదురుసు
ఇప్పుడే కాదు చాలా సందర్భాల్లో సాద్వీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా గాంధీపైనే అనుచిత వ్యాఖ్యలు చేశారు. భోపాల్లో మీడియాతో మాట్లాడుతూ.. గాంధీ జాతి పిత కాదని.. జాతి కుమారుడు అని కొత్త అర్థం చెప్పారు. అందుకే గాంధీని ప్రతి ఒక్కరు గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు.
బీజేపీ సంకల్ప్ యాత్ర
గాంధీ 150వ జయంతి సందర్భంగా బీజేపీ గాంధీ సంకల్ప్ యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలను కలుపుతూ యాత్ర చేపట్టారు. అయితే ఆ ర్యాలీల్లో సాద్వీ పాల్గొనలేదు. కానీ గాంధీ గురించి మాత్రం భోపాల్ రైల్వేస్టేషన్ వద్ద అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే మీరు ఎందుకు గాంధీ సంకల్ప్ యాత్రలో పాల్గొనలేదు అని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే.. గాంధీ జాతి కుమారుడు, అతనిని తానేప్పుడు గౌరవిస్తానని చెప్పారు. కానీ ర్యాలీలో ఎందుకు పాల్గొనలేదనే అంశంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
అందరికీ వందనం
ఒక్క గాంధీయే కాదు దేశ స్వాతంత్ర్యం కోసం పాటుపడ్డ ప్రతి ఒక్కరి పట్ల తాను గౌరవిస్తానని సాద్వీ పేర్కొన్నారు. వారిని తాను ఎట్టి పరిస్థితుల్లో విస్మరించబోనని తేల్చిచెప్పారు. తమకు స్వాతంత్ర్యం సిద్ధించిన నేతల పట్ల గౌరవం సర్వదా ఇస్తానని పేర్కొన్నారు. వారి పోరాట పటిమతోనే తమకు స్వాతంత్ర్యం వచ్చిందనే విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
దిగ్గీనే మట్టికరిపించారు
గత సార్వత్రిక ఎన్నికల్లో సాద్వీ భోపాల్ నుంచి గెలుపొందిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ దిగ్గజ నేత దిగ్విజయ్ సింగ్ను మట్టికరిపించారు. అయితే సాద్వీ మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉంటారు. ఇటీవల నాథురాం గాడ్సేను కూడా సాద్వీ కొనియాడిన సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. దేశ విభజనపై సాద్వీ నోరుపారేసుకోవడం కలకలం రేపింది. దీనిపై ఏకంగా బీజేపీ నేత సాద్వీకి షోకాజ్ నోటీసులు కూడా జారీచేశారు.