గాంధీ విగ్రహం ధ్వంసం: ఐఎస్ఐఎస్ నినాదాలు
జైపూర్: రాజస్థాన్ లో జాతిపిత మహాత్మాగాంధీకి అవమానం జరిగింది. దుండగులు మహాత్మాగాంధీ విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. తరువాత విగ్రహం మీద ఐఎస్ఐఎస్ జిందాబాద్ అంటూ నినాదాలు రాశారని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసుల కథనం మేరకు రాజస్థాన్ లోని డుడు ప్రాంతంలో ఆదివారం అర్దరాత్రి దాటిన తరువాత మహాత్మాగాంధీ విగ్రహంలోని ముఖం, తల భాగాలను ధ్వంసం చేశారు. అనంతరం విగ్రహం ముందు, వెనుక భాగాల్లో ఐఎస్ఐఎస్ జిందాబాద్ అంటూ నినాదాలు రాసి పరారైనారు.
సోమవారం ఉదయం విషయం గుర్తించిన స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహం ముందు ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్న వారికి నచ్చచెప్పారు.
గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగే సమయంలో హింసను ప్రేరేపించడానికి దుండగులు ఇలా చేసి ఉంటారని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.