బులంద్షహర్ అల్లర్లు: పోలీసు అధికారి హత్యకేసులో ప్రధాన నిందితుడు అరెస్టు
గతేడాది డిసెంబర్లో ఉత్తర్ ప్రదేశ్లోని బులంద్షెహర్లో చోటుచేసుకున్న అల్లర్లకు సంబంధించి ప్రధాన నిందితుడిగా ఉన్న బజరంగ్దళ్ నేత యోగేష్ రాజ్ను పోలీసులు అరెస్టు చేశారు. అల్లర్ల సందర్బంగా మృతిచెందిన పోలీసు అధికారి సుబోధ్ కుమార్ సింగ్ కేసులో యోగేష్ను కూర్జాలో పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. అంతకుముందు యోగేష్ ఓ రహస్య ప్రాంతం నుంచి ఓ వీడియోను విడుదల చేశాడు. ఈ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని వీడియోలో పేర్కొన్నాడు. అల్లర్లు జరిగిన సమయంలో తాను అక్కడ లేనని చెబుతూ పోలీసులు కావాలనే తన పేరును ఇరికించారని యోగేష్ ఆరోపించాడు. సియానా పోలీస్ స్టేషన్ బయట నిరసనలు జరుగుతుండగా తాను తనతో పాటు మరో వ్యక్తి ఇద్దరు స్టేషన్లోపల కూర్చున్నట్లు వీడియో ద్వారా యోగేష్ వెల్లడించాడు.
తను బజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్గా ఉన్నట్లు చెప్పిన యోగేష్.... తన ఇంట్లో ఉన్న సమయంలో చెరుకు పొలాల్లో ఎవరో గోవును చంపి పడేశారనే ఫోన్ కాల్ వచ్చిందని చెప్పాడు యోగేష్. ఫోన్ రాగానే ముందుగా ఘటనా స్థలానికి వెళ్లి అనంతరం పోలీస్ స్టేషన్కు నేరుగా వెళ్లినట్లు యోగేష్ వెల్లడించాడు. అల్లర్లు జరిగిన సమయంలో తాను పోలీస్ స్టేషన్లో కూర్చున్నట్లు వీడియోలో వివరించాడు. ఇదిలా ఉంటే యోగేష్ వినిపిస్తున్న వాదనలకు భిన్నంగా చాలా వీడియోలు విడుదలయ్యాయి. అందులో యోగేష్ మాట్లాడుతున్నట్లుగా కూడా ఉంది. గోవును ఎవరు చంపారో వారిని పోలీసులు పట్టకునేవరకు రోడ్లను భైఠాయించి వాహనాలను అడ్డకుంటామని చెప్పడం ఉంది. మరో వీడియోలో అల్లర్లు జరుగుతున్న సమయంలో యోగేష్ పోలీసులతో మాట్లాడటం ఉంది.
ఇదిలా ఉంటే ఉత్తర్ ప్రదేశ్ పశ్చిమ ప్రాంత కో కన్వీనర్ ప్రవీణ్ భాటి కూడా రాజ్కు మద్దతుగా నిలిచాడు. యోగేష్ రాజ్కు ఘటనతో ఎలాంటి సంబంధం లేదన్నారు. తను పోలీసులకు సహకరించి నిర్దోషిగా బయటకు వస్తాడనే విశ్వాసాన్ని భాటి వ్యక్తంచేశారు. అరెస్టయిన యోగేష్పై హత్య, హత్యాయత్నం, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులను పోలీసులు నమోదు చేశారు. పొలంలో చనిపోయిన గోవు మృతదేహం కనిపించడంతో ఆందోళన మొదలైంది. నిరసనకారులను అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీస్ అధికారి సుబోధ్ కుమార్ సింగ్పై దాడి చేసి అతన్ని చంపేశారు. పోలీసు అధికారితో పాటు మరో స్థానికుడు కూడా ఈ ఘటనలో మృతి చెందాడు.