టైమ్స్ నౌ - విఎంఆర్ ఎగ్జిట్ పోల్: యుపిలో బిజెపి హవా
టైమ్స్ నౌ - విఎంఆర్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి భారీగా లాభపడే సూచనలు కనిపిస్తున్నాయి.
న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభా ఎన్నికల్లో బిజెపి తన హవాను కొనసాగిస్తుందని టైమ్స్ నౌ -విఎంఆర్ సర్వే తెలియజేస్తోంది. కాషాయ పార్టీకి ఈ రాష్ట్రంలో 190 నుంచి 210 సీట్లు వస్తాయని అంచనా వేసింది. యుపిలో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలున్నాయి.
సమాజ్వాదీ, కాంగ్రెసు కూటమికి 110 నుంచి 130 సీట్లు వస్తాయని అంచనా వేసింది. బహుజన సమాజ్ పార్టీ (బిఎస్పీ) 57 నుంచి 74 సీట్ల వరకు గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఎస్పీ- కాంగ్రెసు కూటమి రెండో స్థానంలో నిలుస్తుండగా, బిఎస్పీ మూడో స్థానంతో సరిపెట్టుకుంటుందని ఈ సర్వే అంచనా వేసింది.
జాతీయ రాజకీయాలపై ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాల ప్రభావం పడుతుంది. దీంతో ఈ రాష్ట్ర ఎన్నికల ఫలితాలపైనే అందరి దృష్టీ ఉంది. 2014 లోకసభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి 73 ఎంపీ సీట్లను గెలుచుకుంది. ఈ సంఖ్యనే నరేంద్ర మోడీ ప్రధాని కావడంలో కీలక పాత్ర పోషించింది.
బిజెపిని నిలువరించడానికి అధికార ఎస్పీ కాంగ్రెసుతో పొత్తు పెట్టుకుని శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసింది. అయితే, ఈ పొత్తు ఏ మేరకు ఫలితం ఇస్తుందనేది ఈ నెల 11వ తేదీన తేలనుంది. ఆ రోజు ఓట్ల లెక్కింపు జరిగి అధికారికంగా ఫలితాలు వెలువడుతాయి.
యుపి రాజకీయాల్లో అసక్తికరమైన విషయం ఏమిటంటే, ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్కు కాంగ్రెసుతో పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేదు. ఎస్పీలో ఎన్నికలకు ముందు కుటుంబ రాజకీయాల కారణంగా అంతర్గత సంక్షోభం చోటు చేసుకుంది.