ఆ మేజర్ సీనియారిటీ తగ్గించిన ఆర్మీ
ఢిల్లీ : కాశ్మీరీ యువతితో సన్నిహితంగా మెలగడం, శ్రీనగర్లో హోటల్ సిబ్బందితో గొడవపడి పోలీసులకు చిక్కిన మేజర్ లీతుల్ గొగోయ్పై ఆర్మీ కఠిన చర్యలు తీసుకుంది. అతని సీనియారిటీని ఆరు నెలలు తగ్గించాలని నిర్ణయించింది. పెన్షన్ విషయంలో లీతుల్ గొగోయ్ సీనియారిటీని ఆరు నెలలు తగ్గిస్తూ ఆర్మీ ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు కాశ్మీర్ వెలుపల పోస్టింగ్ ఇవ్వాలని నిర్ణయించింది.
పేట్రేగిన ఉగ్రవాదులు: పోలింగ్ కేంద్రంపై గ్రనేడ్ల దాడి
గతేడాది పోలీసులకు పట్టుబడ్డ లీతుల్
గత సంవత్సరం మే 23న లీతుల్ గొగోయ్ స్థానిక యువతితో కలిసి శ్రీనగర్లోని ఓ హోటల్కు వెళ్లాడు. ఆన్లైన్లో రూం బుక్ చేసినా యువతి స్థానికురాలు కావడంతో సిబ్బంది గది కేటాయించేందుకు నిరాకరించారు. దీంతో రెచ్చిపోయిన మేజర్ లీతుల్ అక్కడ రచ్చ చేశారు. పోలీసులకు ఫిర్యాదు అందడంతో మేజర్ను అదుపులోకి తీసుకున్నారు. ఆర్మీ ఆయనకు కోర్టు మార్షల్ విధించింది.
మార్చిలో ముగిసిన కోర్ట్ మార్షల్
ఆర్మీ నిబంధనలు ఉల్లంఘించి స్థానిక యువతితో సన్నిహితంగా మెలగడం, విధి నిర్వాహణను పక్కనబెట్టి అనుమతి లేకుండా మరో ప్రాంతానికి వెళ్లడంపై లీతుల్ గొగోయ్పై సైన్యం విచారణ జరిపింది. బ్రిగేడియర్ ర్యాంక్ అధికారి నేతృత్వంలో కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ ఏర్పాటు చేసింది. విచారణ జరిపిన కమిటీ లీతుల్ తప్పు చేసినట్లు తేల్చింది. మార్చిలో కోర్ట్ మార్షల్ పూర్తికాగా.. తాజాగా ఆయన సీనియారిటీని తగ్గిస్తూ నిర్ణయం వెలువరించింది. సీనియారిటీ తగ్గించినందున ఇకపై లీతుల్ గొగోయ్ తన బ్యాచ్ అధికారులతో సమానంగా ప్రమోషన్లు పొందే అవకాశంలేకుండా పోయింది.
కాశ్మీరీ పౌరున్ని జీపుకు కట్టి
లీతుల్ గొగోయ్ వ్యవహారశైలి వివాదాస్పదం కావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో జమ్ము కాశ్మీర్లోని బుడ్గాం జిల్లాలో రాళ్ల దాడి నుంచి రక్షించుకునేందుకు ఫరూక్ అహ్మద్ అనే వ్యక్తిని జీవుకు కట్టి మీడియా హెడ్ లైన్స్లో నిలిచారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా దుమారం రేగింది. అయితే ఆర్మీ మాత్రం ఆయన చర్యను ప్రశంసించింది. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్స్ కమెండేషన్ కార్డుతో సత్కరించింది.