షాకింగ్: భారత గగనతలంలోకి పాక్ ఆర్మీ హెలికాప్టర్! 10 సెకండ్లకే తోకముడిచి...
న్యూఢిల్లీ: పాకిస్తాన్ మరోసారి దుస్సాహసానికి ఒడిగట్టింది. హద్దుమీరి సరిహద్దులో పిల్ల చేష్టలు చేయబోయింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. బుధవారం ఉదయం పాకిస్తాన్ ఆర్మీకి చెందిన ఎంఐ-17 హెలికాప్టర్ అక్రమంగా భారత గగనతలంలోకి ప్రవేశించింది.
పూంఛ్ సెక్టర్లో నియంత్రణ రేఖను దాటి సుమారు 300 మీటర్లు భారతదేశంలోకి చొచ్చుకొచ్చింది. దాదాపు 10 సెకండ్లపాటు ఈ హెలికాప్టర్ మన దేశ గగనతలంలో సంచరించి, తిరిగి పాకిస్తాన్లోకి వెళ్లిపోయింది. ఈ సందర్భంగా ఎలాంటి కాల్పులు చోటుచేసుకోలేదు.
ఓ పక్క చొరబాట్లకు పాల్పడుతూ, కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు దిగుతున్న పాక్ బుధవారం హెలికాప్టర్తో ఏకంగా దేశంలోకి చొరబడే దుస్సాహాసానికి ఒడిగట్టింది. పూంచ్ సెక్టార్లోకి ప్రవేశించిన పాక్ హెలికాప్టర్ను చూడగానే భారత భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. దీంతో పాక్ ఆర్మీ హెలికాప్టర్ వెంటనే తోకముడిచింది.
ఒకవేళ పాక్ ఆర్మీ హెలికాప్టర్ తిరిగి వెనక్కి వెళ్లడం ఏమాత్రం ఆలస్యం చేసినా భారత బలగాల చేతుల్లో అది నేలకూలి సంచలనంగా మారేది. మరోవైపు పాక్ ఆర్మీ దుస్సాహసంపై భారత ఆర్మీ అధికారులు మండిపడుతున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే పాక్ ఆర్మీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వివరణ ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది.
అంతేకాదు, ఈ ఘటనను తేలిగ్గా వదిలేయరాదని భారత ఆర్మీ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. భారత్లోని పాక్ హైకమిషనర్కు కూడా నోటీసులు ఇవ్వాలని అనుకుంటున్నారు. అలాగే, పాక్లోని ఉన్నతాధికారుల దృష్టికి, అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లే యోచన చేస్తున్నారు.