ఢిల్లీలో 9మంది ఉగ్రవాదుల మకాం! కాశ్మీర్లో ప్రాణాలతో పట్టుబడ్డ ఉగ్రవాది
న్యూఢిల్లీ/శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లోని ఉధంపూర్ ప్రాంతంలో బుధవారం ఉదయం ఉగ్రవాదులు బీఎస్ఎఫ్ జవాన్ల కాన్వాయ్ పైన దాడి చేశారు. జవాన్లు ఎదురు దాడికి దిగారు. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఒకరు ప్రాణాలతో భద్రతాదళాల చేతికి చిక్కాడు.
మరో ఉగ్రవాది కాల్పుల్లో హతమయ్యాడు. దీంతో ఉధంపూర్లో ఉగ్రవాదులు, సైన్యం మధ్య పోరాటం ముగిసింది. పట్టుబడిన ఉగ్రవాదిని ఖాసిం ఖాన్గా గుర్తించారు. పాకిస్థాన్ నుంచి అతను వచ్చినట్లు భావిస్తున్నారు.
ఈ ఉగ్రవాదులకు ఇటీవల పంజాబ్లోని గురుదాస్పూర్లో జరిగిన దాడితో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
బీఎస్ఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు చేసిన దాడిలో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. కొన్ని గంటల పాటు ఇరు వర్గాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. నర్సూ ప్రాంతంలో ఉగ్రవాది బందీలుగా ఉంచిన ముగ్గురు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఢిల్లీలో మకాం వేసిన ఉగ్రవాదులు
ఆగస్టు 15న స్వాతంత్ర వేడుకలను భగ్నం చేసేందుకు తొమ్మిది మంది ఉగ్రవాదులు దేశ రాజధాని ఢిల్లీలో మకాం వేశారని నిఘా వర్గాలకు సమాచారం అందిందింది. దీంతో భద్రతాదళాలు అప్రమత్తమయ్యాయి. ఉగ్రవాదులు ఆర్డీఎక్స్, డిటొనేటర్లు సహా భారీ ఎత్తున పేలుడు పదార్థాలను తీసుకొచ్చినట్టు నిఘా వర్గాలు గుర్తించినట్లుగా తెలుస్తోంది.
ఈ హెచ్చరికలను సీరియస్గా తీసుకున్న కేంద్రం అన్ని సెక్యూరిటీ ఏజెన్సీలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. వీరంతా మూడు నెలలకు ముందే న్యూఢిల్లీకి చేరారని, వీరివద్ద అధునాతన ఆయుధాలు ఉండవచ్చని నిఘా వర్గాలు వెల్లడించాయని సమాచారం.