బెంగుళూరు నివాసయోగ్యం కాదా?: ఇన్ఫోసిస్ మూర్తి
బెంగుళూరు: కర్ణాటక రాజధాని బెంగుళూరు నగరం నివాసయోగ్యంగా లేదా? ఈ నగరాన్ని మరింత నివాస యోగ్యంగా మార్చాలని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం ప్రారంభమైన 'ఇన్వెస్ట్ కర్ణాటక 2016' ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు.
భారతీయ యువతలో ఎక్కువ భాగం బెంగుళూరులోనే తమ ఉద్యోగాలను ప్రారంభిస్తున్నారని ఆయన చెప్పారు. అలాంటి ప్రాంతాన్ని అందరికీ నివాసయోగ్యంగా తీర్చిదిద్దాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ముఖ్యంగా ఐటీ రంగంలో కేరీర్ ప్రారంభించాలనుకునే యువత బెంగుళూరునే ఫస్ట్ ఛాయిస్గా ఎంచుకుంటున్నారన్నారు.
ఇందుకు తగ్గట్టుగా విద్య, శిక్షణ సంస్ధలు, మౌలిక సదుపాయాలను కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. దీంతోపాటు ఆరోగ్య రంగంలో కూడా మరిన్ని సదుపాయాలను కల్పించాలన్నారు. దేశ జీడీపీలోని ఐటీ రంగం నుంచి 38 శాతం బెంగుళూరు నుంచే వస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
ఇది సుమారు 35 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందన్నారు. ఐటీ రంగ అభివృద్ధికి కర్ణాటక ప్రభుత్వం చేస్తోన్న కృషి అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో మరింతగా అభివృద్ధి చెందాలని తాను కోరుకుంటున్నట్టు వివరించారు.
బెంగుళూరు నగరంలో ఇన్ఫోసిస్ను స్థాపించేందుకు సహాయపడిన కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటికీ కృతజ్ఞతా పూర్వకంగా ఉంటానని నారాయణ మూర్తి చెప్పుకొచ్చారు. కర్ణాటకలో ఇన్ఫోసిస్కు బెంగుళూరు, మంగుళూరు, మైసూర్లలో డెవలప్మెంట్ సెంటర్లు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. త్వరలో హుబ్లీలో మరో డెవలప్మెంట్ను ప్రారంభించనున్నట్లు ఆయన చెప్పారు.