"ట్రైన్ 18" వచ్చేస్తోందోచ్: పట్టాలెక్కనున్న ఇంజిన్ లేని హైస్పీడ్ రైలు
Recommended Video
న్యూఢిల్లీ: స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన సెమీ హైస్పీడు రైలు "ట్రైన్ 18"ను భారతీయ రైల్వే సంస్థ వచ్చే నెల ట్రయల్ రన్ నిర్వహించనుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే ఇక రెగ్యులర్గా ఈ రైలును నడుపుతామని రైల్వే అధికారులు వెల్లడించారు. ఇండియన్ రైల్వేస్కు సాంకేతిక సలహాలు ఇస్తున్న సంస్థ ది రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ఈ ట్రయల్ రన్ నిర్వహించి దీనిపై ఒక నివేదికను భారతీయ రైల్వేలకు అందజేస్తుంది.
సాధారణంగా అన్ని బోగీలను ఇంజిన్ తీసుకెళుతుంది. కానీ ట్రైన్ 18 మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటుంది. దీనికి ఇంజిన్ ఉండదు. అన్ని బోగీలకు సెల్ఫ్ ప్రొపెల్లర్ అమర్చారు. ప్రస్తుతం మెట్రో రైళ్లు కూడా ఇదే పద్ధతి ద్వారా నడుస్తున్నాయి. జూన్లోనే ట్రైన్ 18 పట్టాలు ఎక్కాల్సి ఉన్నప్పటికీ కొన్ని కారణాలతో వాయిదా పడింది. మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ రైలును రూపొందించారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ఈరైలు పరిగెడుతుంది.
ట్రైన్ 18 పట్టాలు ఎక్కితే దీన్ని శతాబ్ది ఎక్స్ప్రెస్ స్థానంలో నడిపేందుకు ప్లాన్ చేస్తోంది రైల్వేశాఖ. మరో ఆరు ట్రైయిన్ 18లను కూడా ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ తయారు చేస్తుందని అధికారులు స్పష్టం చేశారు. ఇందులో రెండిటికి స్లీపర్ కోచ్లు ఉంటాయని వారు తెలిపారు. అన్ని బోగీలు ఒకదానితో ఒకటి అనుసంధానం చేసి ఉంటాయని చెప్పారు. ఈ బోగీలన్నిటికీ ఆటోమేటిక్ డోర్ వ్యవస్థ ఉందని, సెన్సార్లు ఉంటాయని, వైఫైతోపాటు ఇతర ఇన్ఫోటెయిన్ మెంట్ వ్యవస్థ ఉంటుందని వివరించారు.
ప్రయాణికుల సమాచారం జీపీఎస్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఇందులో బయో వాక్యుమ్ వ్యవస్థ కలిగిన మాడ్యులర్ టాయ్లెట్స్ ఈ రైలులో ఉంటాయని అధికారులు తెలిపారు. దివ్యాంగులకు టాయ్లెట్స్ అందుబాటులోనే ఉండేలా డిజైన్ చేశామని అధికారులు తెలిపారు. అత్యాధునిక సీటింగ్ వ్యవస్థ దీని సొంతంమని చెప్పిన అధికారలు ... ట్రైన్ 18 ప్రయోగం విజయవంతమైతే ఇంటిగ్రెల్ కోచ్ ఫ్యాక్టరీ ట్రైన్ 20కి శ్రీకారం చుడుతుందని చెప్పారు. ట్రైన్ 20 బాడీ మొత్తాన్ని అల్యూమినియంతో తయారు చేస్తారని వివరించారు.