రేపిస్టుల కాళ్లూ చేతులూ విరిచేయాలి: నవ్వేసినవారిపై ఎంపి సీరియస్
న్యూఢిల్లీ: రేపిస్టుల కాళ్లు, చేతులు విరిచెయ్యడానికి ఒక చట్టాన్ని పార్లమెంటు చేయాలని ఆర్పిఐ (ఎ)ఎంపి రాందాస్ అతవాలే శుక్రవారం రాజ్యసభలో డిమాండ్ చేసారు. ముంబైలోని లోనావాలాలో ఏడేళ్ల బాలిక అత్యాచారం, హత్య పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ, మూడునుంచి ఏడేళ్ల లోపు చిన్నారులపై కూడా అత్యాచారాలు జరగడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విధమైన నేరాలకు పాల్పడే వారి కాళ్లు చేతులు విరిచేసేందుకు వీలుగా ఒక చట్టాన్ని చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ‘రేప్లకు పాల్పడే మగవాళ్ల కాళ్లు చేతులు విరిచేయాలి. ఇందుకోసం పార్లమెంటులో ఒక చట్టం చేయాలి' అని అతవాలే అన్నారు. లోనావాలాలాంటి కేసుల్లో ఉరితీయడంలాంటి కఠిన శిక్షలు విధించడానికి వీలుందని ఆయన అంటూ అయితే మరో చట్టం కూడా అవసరం ఉందని ఆయన అన్నారు.
స్ర్తి,పురుషుల మధ్య శారీరక సంబంధం అనేది పరస్పర అంగీకారంతో మాత్రమే ఉండాలే తప్ప బలవంతంగా కాదని ఆయన అంటూ, అత్యాచారాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అతవాలే వ్యాఖ్యలను సభ్యులు తేలిగ్గా తీసుకుని నవ్వేయడంతో తాను మహిళలపై అత్యాచారాలు అనే చాలా సీరియస్ విషయాన్ని ప్రస్తావిస్తున్నానని ఆయన అన్నారు.
లోనావాలాలో మృతి చెందిన బాలిక తన కుటుంబ సభ్యులతో కలిసి ఓ పెళ్లి వేడుకకోసం హోటల్కు వెళ్లింది. ఆ తర్వాత ఆ బాలిక కనిపించలేదు. హోటల్ టెర్రేస్పై గొంతుకోసి ఉన్న బాలిక మృతదేహం ఆ తర్వాత కనిపించింది. దాదాపు వారం రోజుల క్రితం ఈ సంఘటన జరిగింది.