పెళ్లికి ముందే లైంగిక పరీక్షలు ఎందుకొద్దు?: కోర్టు ప్రశ్న
చెన్నై: వివాహానికి ముందే అబ్బాయి, అమ్మాయిలకు ఇంపోటెన్సీ(నపుంసకత్వం), ఫ్రిజిడిటి (లైంగిక సామర్థ్యం) పరీక్షలను ఎందుకు తప్పని చేయకూడదంటూ మద్రాస్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ మేరకు కేంద్రానికి మద్రాస్ హైకోర్టు మదురై బెంచి నోటీసులు జారీ చేసింది. ఎమ్మెస్సీ ఐటి చేసి ఓ యువతికి నిరుడు జూన్లో వివాహమైంది. తన భర్త నపుంసకుడని తెలిసిన ఆమె విడాకులు కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
‘ఇలా వైవాహిక బంధాలు విఫలమవకుండా నిరోధించడానికి పెళ్లికి ముందే లైంగిక పరీక్షలు నిర్వహించడాన్ని తప్పనిసరి చేయాల్సిన అవసరం లేదా అని' ఈ కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ ఎస్ కిరుబాకరస్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భర్త నపుంసకత్వం లేదా భార్య లైంగిక సామర్థ్యం లేమి.. ప్రస్తుతం వైవాహిక బంధం బీటలు వారడానికి ప్రధాన కారణమవుతున్నాయని అన్నారు. ఇందువల్ల విడాకుల కేసులు పెరిగిపోతున్నాయని చెన్నై ఫ్యామిలీ కోర్టులో నమోదవుతున్న విడాకుల కేసులను ఉదహరించారు.
ఈ విధంగా వైవాహిక బంధం విఫలం కాకుండా నిరోధించడానికి ‘పెళ్లికి ముందే లైంగిక పరీక్షలు నిర్వహించడం తప్పనిసరి ఎందుకు చేయకూడదు' అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ కారణాలపై దాఖలైన కేసులు ఆరు నెలల నుంచి ఏడాది లోపు పరిష్కరించేలా వివాహ చట్టాలను ఎందుకు సవరించకూడదని అన్నారు.
వివాహ సమయంలో ఈ విషయాలను దాచిపెట్టి జీవిత భాగస్వామిని మోసం చేసినవారి నుంచి పరిహారం దక్కేలా, వారిని శిక్షించేలా ఎందుకు చేయకూడదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అత్యంత తీవ్రమైన ఈ సమస్యను పరిష్కరించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని కేంద్రాన్ని, తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ కేసు విచారణ సెప్టెంబర్ తొలి వారానికి వాయిదా వేశారు.